అంబ‌టి రాయుడికి వైసీపీ కండువా

భార‌త క్రికెట‌ర్, గుంటూరు జిల్లాకు చెందిన అంబ‌టి రాయుడు.. ఏపీ అధికార పార్టీవైసీపీలో చేరారు. రాయుడిని సీఎం జ‌గ‌న్ సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించి.. కండువా క‌ప్పారు. ఈ సంద‌ర్భంగా క్రికెట‌ర్ రాయుడు మాట్లాడుతూ.. వైసీపీలో చేర‌డం సంతోషంగా ఉంద‌న్నారు. జీవితంలో త‌న సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంద‌ని తెలిపారు. తొలి నుంచి త‌న‌కు సీఎం జ‌గ‌న్ పై న‌మ్మకం ఉంద‌ని, కుల మ‌తాల‌కు అతీతంగా సీఎం జ‌గ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని తెలిపారు.

జ‌గ‌న్ పాల‌న చాలా పార‌ద‌ర్శ‌కంగా ఉంద‌ని అంబ‌టి రాయుడు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, నాలుగు మాసాల కింద‌టే రాయుడు వైసీపీలో చేర‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న‌ను అప్ప‌ట్లోనే ఆడుదాం ఆంధ్ర ప్ర‌తిష్టాత్మ‌క క్రీడా పోటీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌భుత్వం ఎంపిక కూడా చేసింది. ఇక‌, గ్రామాల్లో ప‌ర్య‌టించిన రాయుడు.. పింఛ‌న్లు స‌మ‌యానికి అంద‌డం.. వలంటీర్ల సేవ‌లు, స‌చివాల‌యాల ఏర్పాటు వంటి అనే విష‌యాల‌ను ప‌రిశీలించారు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు.

ఆ త‌ర్వాత ఎందుకో అనూహ్యంగా నాలుగు మాసాల గ్యాప్ వ‌చ్చింది. దీంతో రాయుడు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నార‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది. త‌ర్వాత ఆయ‌న కూడా సైలెంట్ అయిపోయారు. రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌కు కూడా స్పందించ‌లేదు. మ‌రోవైపు.. తాజ‌గా రెండు రోజుల కింద‌ట సీఎం జ‌గ‌న్ ఆడుదాం ఆంధ్ర కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ప్పుడు కూడా అంబ‌టి రాలేదు. దీంతో ఆయ‌న వైసీపీ ఇక‌, దూర‌మేన‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఉరుములు లేని పిడుగుల మాదిరిగా.. అంబ‌టి సీఎం కార్యాల‌యానికి వెళ్లే వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అత్యంత ర‌హ‌స్యంగా రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు గుంటూరు జిల్లాలోని ఓ కీల‌క నియోజ‌క‌వ‌ర్గం(స‌త్తెన‌ప‌ల్లి/ న‌ర‌సారావు పేట‌) కేటాయించే అవ‌కాశం ఉంద‌ని పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది.