వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ అక్కడి నుంచా?

మొన్నటి వరకు తెలంగాణ రాజకీయమే తన లక్ష్యంగా చెప్పుకున్న షర్మిల.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఏపీ రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన వేళ.. నామరూపాల్లేకుండా పోయినకాంగ్రెస్ పార్టీ ఉనికిని మళ్లీ పునరుద్దరించే పనిలో పడిన కాంగ్రెస్ పార్టీ.. అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్ని షర్మిల చేతిలో పెట్టాలని భావిస్తున్న వైనం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. షర్మిలను పార్టీరథసారధిగా ప్రకటిస్తే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికిని సాధించినట్లు అవుతుందన్న అంచనాలు వ్యక్తం కావటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే.. ఆమెను కడప లోక్ సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించాలని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ కోరిన వైనం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని ఏపీసీసీ వర్కింట్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ వెల్లడించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరనుందా?ఏపీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నలను ఏఐసీసీ పెద్దల ముందు ప్రస్తావించిన వేళ.. ఆమెను పోటీకి దించాలన్న అంశంపై చర్చకు వచ్చినట్లుగా పేర్కొన్నారు.

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటే వైఎస్ వారసత్వం పార్టీలోకి వచ్చినట్లు అవుతుందని.. దీంతో పార్టీకి దూరమైన నేతలు.. ఓటర్లను తిరిగి ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగాపార్టీకి చెందిన నేతల నుంచి పార్టీ అధినాయకత్వంఅభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో ఆమెను పార్టీలోకి తీసుకోవటంతో పాటు.. ఆమెను ఎన్నికల బరిలో దించాలన్న సూచన రావటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొస్తే.. అధికార వైసీపీలో అసంత్రప్తిగా ఉన్న పలువురు నేతలు కాంగ్రెస్ లోకి రావటానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.