గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన

స‌హ‌జంగా నాయ‌కులు.. అన‌గానే ఎంతో కొంత గ‌ర్వంతో కూడిన ద‌ర్పం కామ‌న్‌గానే ఉంటుంది. ఆ మాత్రం ద‌ర్పం చూపించ‌క‌పోతే.. ఎలా అని కూడా అనుకుంటారు. అందుకే ‘గెలిచే వార‌కు సుబ్బ‌య్య‌.. గెలిచాక సుబ్బారావు అయ్యాడ‌’నే సామెత పుట్టింది. అయితే.. అంద‌రూ అలానే ఉంటారా? అంటే చెప్ప‌లేం. కానీ, ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు మాత్రం కొంత డౌన్ టు ఎర్త్‌(ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌నే) అన్న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తారు. త‌మ‌కు ఎంత పెద్ద ప‌ద‌వి ఉన్నా.. ఎంత పెద్ద బాధ్య‌త ఉన్నా.. సింప్లిసిటీగానే లాగిస్తారు.

ఇలాంటి వారు గ‌తంలో అంటే ఓ 3 ద‌శాబ్దాల కిందట త‌ర‌చుగా క‌నిపించేవారు. కానీ, నేడు చిరు గ్రామానికి స‌ర్పంచ్ అయినా.. హైఎండ్ కార్లోనే తిరుగుతున్న ప‌రిస్థితి. అయితే.. ఇలాంటి వారికి భిన్నంగా తెలంగాణలో ని రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న ధ‌న‌స‌రి అన‌సూయ‌, అలియాస్ సీత‌క్క వ్య‌వ‌హ‌రించారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం జామినిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప‌లువురు స్థానికులు ఆమెను మేడం మేడం అంటూ.. సంబోధించారు. దీంతో మంత్రి సీత‌క్క కొంత ఫీల‌య్యారు. త‌న‌కు ఎందుకింత గౌర‌వ‌మ‌ని.. ఒక వేళ వ‌చ్చి ఉంటే ఈ గౌర‌వం ఇచ్చింది మీరే అంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం… మేడం అంటే దూరం అయిపోతము. అదే గుర్తు పెట్టుకోండి. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లిలాగా కలిసి పోతాం. పదవులు శాశ్వతం కాదు.. విలువలు, మంచి పనులే శాశ్వతం. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన. ప్రజలకు ఏ అవసరం ఉన్నా మాతో స్వేచ్చగా చెప్పుకోవచ్చు” అంటూ మంత్రి సీతక్క పేర్కొన్నారు.

మంత్రి సీత‌క్క‌.. కేవ‌లం మాట‌ల్లోనే కాదు.. చేత‌ల్లోనూ సింప్లిసిటీ చూపిస్తున్నారు. మంత్రిగా ఉన్న సీత‌క్క‌కు నాలుగు కార్ల‌తో కాన్వాయ్ ఏర్పాటు చేస్తే.. వ‌ద్ద‌ని రెండు కార్ల‌కే కుదించుకున్నారు. ఇక‌, ఖ‌రీదైన ప‌ట్టు చీర‌లు క‌ట్టుకునే(మంత్రిగా కాస్ట్యూమ్స్ ఖ‌ర్చు ఇస్తారు) అవ‌కాశం ఉన్నా.. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఎలాంటి వ‌స్త్రాలు ధ‌రించారో వాటినే క‌ట్టుకుంటున్నారు. మొత్తానికి సీత‌క్క‌.. ఎంత వ‌ర‌కు త‌గ్గాలో అంతా త‌గ్గి.. తాను నిజంగా ప్ర‌జ‌ల మ‌నిషినేన‌ని నిరూపించుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.