ఆడుదాం ఆంధ్ర‌.. తొలిరోజే విరిగిన బ్యాట్లు

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఆడుదాం ఆంధ్ర‌ క్రీడా ప్రోత్సాహ‌క కార్య‌క్ర‌మాన్ని సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం గుంటూరులో ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో అన్ని జిల్లాల్లోనూ ఈ కార్య‌క్ర‌మంలో ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఔత్సాహిక క‌ళాకారుల‌ను ఎంపిక చేసి క్రీడా ప‌రిక‌రాల‌తో కూడిన కిట్ల‌ను వారికి పంపిణీ చేశారు. ఇది కూడా జిల్లాల్లోనూ పంపిణీ చేశారు. ఈ కిట్‌లో క్రికెట్ బ్యాటు, చేతుల‌కు, కాళ్ల‌కు ధ‌రించే ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు, టెన్సిస్ ర్యాకెట్‌, క‌ప్‌లు ఇలా.. 7 ర‌కాల క్రీడ‌ల‌కు సంబంధించిన ప‌రిక‌రాల‌ను పంపిణీ చేశారు.

అయితే.. వీటిలో ఎక్కువ‌గా ఆక‌ర్షించిన‌వి క్రికెట్ బ్యాట్లు. ఎక్కువ మంది క్రీడా కారుల‌కు ఈ కిట్లు కూడా పంపిణీ చేశారు. అయితే.. తొలి రోజే చాలా జిల్లాల్లో ఈ బ్యాట్లు తొలి మ్చాచ్‌లోనే విరిగి పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో క్రీడాకారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. విరిగిపోయిన బ్యాట్ల‌ను ఫొటోలు తీసి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. దీంతో ఎంతో క‌ష్ట‌ప‌డి రూపొందించిన ఆడుదాం ఆంధ్ర కార్య‌క్రమానికి ఆదిలోనే ఎదురు దెబ్బ‌లు త‌గిలి, ప్ర‌తిప‌క్షాల‌కు ఛాన్స్ ఇచ్చిన‌ట్టు అయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక‌, ఆడుదాం ఆంధ్ర కార్య‌క్ర‌మానికి సంబంధించిన కిట్ల త‌యారీ, పంపిణీపై శాప్ కొన్ని నెల‌ల ముందుగానే దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి చెందిన ఓ సంస్థ‌కు ఈ ప‌రిక‌రాలు అందించే టెండ‌ర్‌ను క‌ట్ట‌బెట్టారు. అయితే.. అప్ప‌ట్లోనే ఈ సంస్థ‌ పై విమ‌ర్శలు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ శాప్ ఆ కంపెనీకే టెండ‌ర్ ఇచ్చేసింది. దాదాపు 500 కోట్ల రూపాయ‌ల విలువైన క్రీడా ప‌రిక‌రాల‌ను మూడు ద‌శ‌ల్లో అందించేలా ఒప్పందం చేసుకుంది. అయితే.. తొలి ద‌శ‌లో పంపిణీ చేసిన ప‌రిక‌రాల్లో నాసిర‌క‌మైన‌వి రావ‌డంతో క్రీడాకారులు నిరుత్సాహానికి గుర‌య్యారు.