ఎంపీ రేసు.. ఈటల ఇక్కడ, చీకోటి అక్కడ?

లోక్ సభ ఎన్నికలు మరోసారి తెలంగాణలో పొలిటికల్ వార్ కు తెరలేపుతున్నాయి. ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో బరిలో దించే అభ్యర్థులపై ఆయా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో సీట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్యంత కీలకమైన మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈటల ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. కానీ ఈ స్థానం కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు, పేరాల చంద్రశేఖర్, వీరేందర్ గౌడ్, సామరంగారెడ్డి, రామచందర్ రావు, ఆకుల రాజేందర్, మల్లారెడ్డి తదితర నేతలు టికెట్ ప్రయత్నాల్లో పడ్డారు.

మరోవైపు క్యాసినో కింగ్ గా పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్ కూడా ఎంపీగా పోటీ చేసేందుకు తనదైన ప్రయత్నాల్లో మునిగిపోయారని టాక్. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇంట్రస్ట్ తో చీకోటి ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి బరిలో దిగేందుకు మాజీ ఎంపీ బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి, ఆలే భాస్కర్ తదితరులు పోటీపడుతున్నారు. సామజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే ఈటల రాజేందర్ నూ ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి తిరిగి మెదక్ ఎంపీ గా పోటీ చేసే ఆస్కారముంది. గతంలో మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన ఆమెను.. మరోసారి అక్కడే బరిలో దింపాలని కాంగ్రెస్ చూస్తుందని తెలిసింది. విజయశాంతి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ అనుకుంటోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దూసుకెళ్తోంది. ఓటమి పాలైన బీఆర్ఎస్ అందుకు గల కారణాలను విశ్లేషించుకునే పనిలో పడింది. ఇక గతంలో కంటే అధికంగా సీట్లు దక్కించుకున్న బీజేపీ భవిష్యత్ పై ఆశతో ఉంది. ఇక ఇప్పుడు అన్ని పార్టీల కన్ను మరో మూణ్నాలుగు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై పడింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. తెలంగాణలోనూ మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలనే ధ్యేయంతో ఉంది.