ఎన్నిక‌ల‌కు ముందు ఆఖ‌రిసారి కుప్పానికి..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా కుప్పానికి ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాదిలో ఏకంగా ఎనిమిది సార్లు ఆయ‌న(అరెస్టుకు ముందు) కుప్పంలో ప‌ర్య‌టించారు. వైసీపీ అధిష్టానం కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌త్యేకంగా చూస్తుండ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును కూడా ఓడిస్తామ‌ని పార్టీ నాయ‌కులు ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న చేస్తున్న ద‌రిమిలా.. చంద్ర‌బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అదేస‌మ‌యంలో కుప్పంలో టీడీపీ నాయ‌కుల‌పై పెడుతున్న కేసుల విష‌యంపై కూడా ఆయ‌న ప్ర‌త్యేకంగా ప‌రిశీలిస్తున్నారు.

ఇదిలావుంటే.. తాజాగా మ‌రోసారి చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. అయితే.. ఇది వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న చివ‌రి ప‌ర్య‌ట‌న‌గా టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రో రెండు మాసాల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానుంది. మార్చి తొలి లేదా రెండో వారంలోనే షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో పొత్తులు ఖ‌రారు చేసుకోవ‌డంతో పాటు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాలి. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డి బ‌హిరంగ స‌భ‌ల‌కు కూడా ప్లాన్ చేయాలి. దీంతో చంద్ర‌బాబు స‌హ‌జంగానే బిజీ అయిపోతారు. ఇక‌, సంక్రాంతి స‌మయంలో ఆయ‌న సొంతూరు చిత్తూరు జిల్లా చంద్ర‌గిరికి వెళ్ల‌నున్నారు.

మొత్తంగా చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు ఇప్పుడు జ‌రుగుతున్న కుప్పం ప‌ర్య‌ట‌నే చివ‌రిద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నా యి. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పాటు సొంత నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు.. ప్ర‌చారం.. జ‌న‌సేన నేత‌ల‌తో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం.. క్షేత్ర‌స్థాయిలో కొన‌సాగుతున్న చిన్న‌పాటి వివాదాల‌ను స‌రిచేసుకోవ‌డం వంటివిష‌యాల‌పై ఆయ‌న దిశానిర్దేశం చేయ‌నున్నారు. మొత్తంగా కుప్పం టీడీపీ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు రెడీ చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుంటే.. గ‌త మూడురోజులుగా ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో జరిగిన ప్ర‌త్యేక యాగం ముగియడంతో చంద్రబాబు హైద‌రాబాద్‌కు బ‌య‌లు దేరారు. సోమ‌, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో హైదరాబాద్‌లోనే చంద్రబాబు ఉండనున్నారు. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు కుప్పం వెళ్తారు. అక్క‌డే మూడు రోజుల పాటు ఉండ‌నున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇదే కుప్పం చివ‌రి ప‌ర్య‌ట‌న కానుండ‌డంతో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది.