జ‌న‌సేన‌కు ఇదే పెద్ద చిక్కు.. కాసులిచ్చేవారేరీ….!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ ఎలా ఉన్నా.. ప‌ది స్థానాలైనా పాతికైనా.. వందైనా.. అస‌లు పోటీలో ఉన్న నాయ‌కులకు కీల‌క వ‌న‌రు సొమ్ములే! ప్ర‌జ‌ల‌కు పంచాల్సిన అవ‌స‌రం లేక‌పోయినా.. పంచ‌క‌పోయినా.. క‌నీసం నాయ‌కుల‌కు చేతి ఖ‌ర్చు.. ప్ర‌చార ఖ‌ర్చు.. వంటివి కీల‌కం క‌దా! ఇవేవీ ఉచితంగా ఎవ‌రూ చేయ‌రు. సో.. ఆ ఖ‌ర్చుల‌కైనా నాయ‌కుల‌కు డ‌బ్బులు కావాలంటే.. ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌నేది జ‌న‌సేన‌లో వినిపిస్తున్న మాట‌.

“వ‌చ్చే ఎన్నిక‌లు భారీ ఖ‌ర్చుతో కూడుకున్న‌వ‌నే టాక్ ఉంది. తెలంగాణ ఎన్నిక‌లు చూశాం. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో 50 ల‌క్ష‌ల‌పైనే ఖ‌ర్చ‌యింది. మా ప‌రిస్థితి చూస్తే.. ఇబ్బంది త‌ప్పేలా లేదు” అని జ‌న‌సేన‌లో నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి కార‌ణం.. చెప్పే ముందు.. మ‌రో కీల‌క విష‌యం ఉంది. సాధార‌ణంగా గెలిచే నాయ‌కుడు ఎవ‌రనేది అంచ‌నాకు వ‌స్తే.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలోని పారిశ్రామిక వేత్త‌లు.. లేదా వ్యాపారులు అడ‌గ‌కుండానే ప‌ని చేసి పెడతారు.

ఇది తెలంగాణ‌లో బాగానే వ‌ర్క‌వుట్ అయింది. దీంతో అస‌లు గెలుపుపై అంచ‌నాలు లేని వారు కూడా విజ‌యం సాధించారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితిఇప్పుడు ఏపీలో జ‌న‌సేన‌కు క‌నిపిస్తుందా? అనేది ప్ర‌శ్న‌. దీనిపైనే జ‌నసేన నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అస‌లు గెలుస్తారా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. గెలుస్తున్నామ‌నే ధీమాను పారిశ్రామిక‌, వ్యాపార వ‌ర్గాల్లో అయిన క‌ల్పించ‌గ‌లిగితే చేతులు త‌డుస్తాయ‌నేది వారి మాట‌. కానీ, ప్ర‌స్తుతం జ‌న‌సేన‌లోనే పెద్ద క‌ల‌క‌లం రేగింది.

పార్టీ పొత్తు పెట్టుకోవ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌క‌పోయినా.. త‌ర్వాత ప‌రిణామాల‌పైనే అంద‌రూ దృష్టి పెట్టారు. దీంతో పారిశ్రామిక‌, వ్యాపార వ‌ర్గాలు.. ఈ పార్టీని ఎంత వ‌ర‌కు ఆద‌రిస్తాయ‌నేది ప్ర‌శ్న‌గామారింది. మ‌రోవైపు.. పార్టీలోనూ భారీగా ఫండ్స్ లేవు. ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ అంటే అభిమానించే వారు కూడా.. పార్టీకి ఫండ్స్ ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. దీంతో అభ్య‌ర్థులు తమ సొంత నిధుల‌నే వెచ్చించాల్సి ఉంటుంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే.. తెలంగాణ‌ను మించి ఖ‌ర్చు అవుతుంద‌నే అంచ‌నాలు వున్న ఏపీ ఎన్నిక‌ల్లో అంత ఖ‌ర్చు భ‌రించే నాయ‌కులు ఉన్నారా? అనేది జ‌న‌సేన టాక్‌. చూడాలి ఏం చేస్తారో.