లాస్ట్ మినిట్ టెన్ష‌న్ వ‌ద్దు.. ముందే తేల్చేయండి

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన క‌లిసి పోటీ చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే.. ఈ రెండు పార్టీల్లోనూ టికెట్ల కేటాయింపు అంశం మాత్రం ఎప్ప‌టి లాగానే.. ముడిప‌డ‌కుండా పోయింది. గ‌త కొన్నాళ్లుగా టికెట్ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తూనే ఉంది. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా ప‌వ‌న్ తెర‌మీద‌కి తెస్తున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు కూడా చూచాయ‌గా చెబుతూనే ఉన్నాయి. క్షేత్ర‌స్థాయిలో ఎప్పుడు ప‌ర్య‌టించినా ప‌వ‌న్‌కు టికెట్ల విష‌యంపైనే పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందు దీనిపై స‌స్పెన్స్ కొన‌సాగితే క‌ష్ట‌మ‌ని వారు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌ర‌చుగా టికెట్ల విష‌యాన్ని ఇటు చంద్ర‌బాబు, అటు నారా లోకేష్‌ల ద‌గ్గర ప్ర‌స్తావిస్తున్నార‌నేది జ‌న‌సేన నాయ‌కుల మాట‌. అయితే.. ఈ విష‌యంలో స్థానికంగా ఉన్న ప‌రిస్థితులు.. టీడీపీ ఆశావ‌హులు.. సిట్టింగు స్థానాలు, గెలుపు గుర్రాలు.. ఇలాఅనేక వ్యూహాలు సిద్ధం చేసుకున్న త‌ర్వాతే టీడీపీ సీట్ల విష‌యాన్ని ప్ర‌స్తావించేందుకు రెడీ అయింది.

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌ల మ‌ధ్య టికెట్ల విష‌యం మ‌రోసారి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్టు పార్టీల నాయ‌కులు చెబుతున్నారు. త‌మ‌కు 40 లేదా 35 స్థానాల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌న‌సేన అధినేత డిమాండ్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యంలో కొంత త‌గ్గాల‌ని.. 25 సీట్ల వ‌ర‌కు ఖ‌చ్చితంగా ప‌రిశీలిస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబు ప‌వ‌న్ ఇంటికి వెళ్లిన విష‌యం తెలిసిందే.

అయితే..అ ప్ప‌ట్లో వారు ఏం చ‌ర్చించార‌నేది మీడియాకు చెప్ప‌క‌పోయినా.. తాజాగా ఆ విష‌యాల‌న‌కు సంబంధించిన ప‌లు అంశాలు ఇరు పార్టీల్లోనూ చ‌ర్చ‌ల‌కు వ‌స్తున్నాయి. త‌మ‌కు 40 సీట్ల‌యినా ఇవ్వాల‌ని ప‌వ‌న్ గ‌ట్టిగానే ప‌ట్టుబడుతున్నార‌ని తెలుస్తోంది. కానీ, ఇప్పుడున్న తీవ్ర‌మైన పోటీ నేప‌థ్యంలో 25 స్థానాల‌కు ప‌రిమితం కావాల‌నేది టీడీపీ అధినేత వ్యూహంగా ఉందని అంటున్నారు. అయితే.. ఏదేమైనా.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కాకుండా.. క‌నీసం నెల రోజుల ముందైనా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌నేది ఇరు పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.