‘వైట్ పేప‌ర్’ పాలిటిక్స్‌తో లాభ‌న‌ష్టాలెవ‌రికి?!

తెలంగాణ రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం గ‌త బీఆర్ ఎస్ ప‌దేళ్ల పాల‌న‌కు సంబంధించి శ్వేత ప‌త్రం(వైట్ పేప‌ర్‌) విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రం ఏవిధంగా అప్పులు పాలైంది? ఎన్ని కోట్ల రూపాయ‌లు అప్పులు చేశారు? ఏయే ప‌థ‌కాలు ఎలా ఉన్నాయి. ఏయే ప్రాజెక్టులు ఎక్క‌డ నిలిచి పోయాయి? వంటి అనేక కీల‌క విష‌యాల‌ను అందులో వివ‌రించారు.

ప్ర‌ధానంగా కేసీఆర్ పాల‌న‌ను టార్గెట్ చేస్తూ.. ఇచ్చిన వైట్ పేప‌ర్ రాజ‌కీయ దుమార‌మే రేపింది. ప్ర‌స్తుతం రోజు వారీ ఖ‌ర్చుల‌కు కూడా.. కేంద్రం ముందు నిల‌బ‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని పేర్కొన‌డం.. కాళేశ్వ‌రం స‌హా ఇత‌ర ప్రాజెక్టుల్లోనూ అవినీతి పెరిగిపోయింద‌ని.. కోట్ల‌కు కోట్లు దోచుకున్నార‌ని చెప్ప‌డం ద్వారా.. కేసీఆర్ పాల‌న‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం బాగానే టార్గెట్ చేసింది. అయితే.. వాస్త‌వానికి.. ఈ శ్వేత ప‌త్రం విడుద‌ల త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ పై అనుమానాలు పెరిగాయి.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయ‌ని.. జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని.. శ్వేత ప‌త్రంలో ప్ర‌బుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నిక‌ల హామీలైన ఆరు గ్యారెంటీల పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని ముందుగానే హెచ్చ‌రించిన‌ట్టు అయింద‌ని ప‌రిశీల‌కులు చెబుతు న్నారు. గ్యారెంటీల‌ను అమ‌లు చేయాల‌ని ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఇబ్బందిగా ఉంద‌నే కార‌ణంగా.. వాటిని ప్రారంభించేందుకు స‌మయం తీసుకునే ఆలోచ‌న ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే, ఈ శ్వేత ప‌త్రంపై సీఎం రేవంత్‌రెడ్డి వాద‌న మ‌రోవిధంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. తాము విడుదల చేసిన శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే విడుదల చేశామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయా లను ప్రజల ముందు పెట్టామన్నారు.

అర్హులైన వారికి సంక్షేమం అందించి, తెలంగాణను దేశంలోనే బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ శ్వేతపత్రం తాము ప్రకటించిన గ్యారెంటీలను ఎగ్గొట్టడానికి కాదని.. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే అని తెలియజేశారు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.