శ్వేతప్రతానికి పోటీగా ప్రగతి నివేదిక ?

కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు శాఖలవారీగా జరిగిన అవినీతి, అక్రమాలపై లెక్కలు తీస్తోంది. ముఖ్యంగా ఇరిగేషన్ అంటే కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజి లాంటివాటితో పాటు విద్యుత్ శాఖలో జరిగిన వేల కోట్ల రూపాయల అవకతవకలు, ధరణి పోర్టల్ అక్రమాలపైన ప్రధానంగా దృష్టిపెట్టింది. వీటిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి అసెంబ్లీలో బీఆర్ఎస్ ను దుమ్ముదులిపేయాలన్నది రేవంత్ రెడ్డి అండ్ కో ప్లాన్.

తమ వ్యూహాన్ని రేవంత్ ప్రభుత్వం ఏమీ దాచుకోవటంలేదు. అంతా చెప్పి బాహాటంగానే చేస్తోంది. అందుకనే దానికి విరుగుడు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీయార్, హరీష్ రావు రెడీ అవుతున్నారట. శ్వేతప్రతానికి పోటీగా ప్రగతి నివేదికను రెడీ చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టే శ్వేతపత్రానికి పోటీగా పదేళ్ళ ప్రగతి నివేదికను ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారట. అందుకు తగ్గట్లే పదేళ్ళలో సాధించిన ప్రగతి వివరాలను అంశాలవారీగా రెడీ చేయాలని పార్టీవర్గాలను ఆదేశించారట.

ఒకవేళ అసెంబ్లీలో ప్రగతి నివేదికను ప్రవేశపెట్టందుకు అవకాశం దక్కకపోతే అదే విషయాన్ని మీడియా సమావేశాల్లో వివరించేందుకు కేటీయార్, హరీష్ రెడీ అవుతున్నారట. మామూలుగా అయితే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ లేదా ప్రగతి నివేదికల్లాంటి వాటిని ప్రవేశపెట్టేందుకు అధికారపార్టీలు అవకాశం ఇవ్వవు. కాబట్టి అసెంబ్లీలో ప్రగతి నివేదికను ప్రవేశపెట్టేందుకు అవకాశం రాదన్న ఉద్దేశ్యంలోనే మాజీమంత్రులున్నారు. అయినా సరే సభలో ఒక ప్రయత్నంచేసి రాకపోతే అప్పుడు మీడియా ముందుకెళ్ళాలన్నది వీళ్ళ ఆలోచనట.

కాళేశ్వరం, మేడిగడ్డ, విద్యుత్ శాఖల్లో తమ పదేళ్ళ పాలనలో జరిగిన ప్రగతిని పాయింట్ బై పాయింట్ వివరించేందుకు కేటీయార్, హరీష్ రెడీ అవుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. తెలంగాణా ఏర్పడకుముందు రాష్ట్రంలోని పరిస్ధితులను, ఏర్పడిన తర్వాత జరిగిన డెవలప్మెంటును లెక్కలతో సహా వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను బీఆర్ఎస్ రెడీచేస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే శ్వేతపత్రాన్ని అడ్డుకోవటం, సదరు శ్వేతపత్రంలో వివరాలు తప్పని పదేపదే చెప్పటమే టార్గెట్ గా బీఆర్ఎస్ పెట్టుకున్నట్లు సమాచారం. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.