వైసీపీ బలాన్ని కొట్టేందుకు బాబు ప్లాన్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గాలి ఎటు వైపు వీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ పార్టీ వీడి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారతున్నాయని భావించిన జగన్ కూడా దిద్దుబాటు చర్యలకు దిగారు. నియోజకవర్గాల ఇంఛార్జీలను మార్చడంతో పాటు మంత్రులు సరిగ్గా పని చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ బలాన్ని కొట్టేందుకు, జగన్ ను దెబ్బ తీసేందుకు బాబు తిరుగులేని ప్లాన్ లు వేస్తున్నట్లు తెలిసింది.

ఎన్నికల్లో ఓ పార్టీని దెబ్బతీయాలంటే ముందుగా ఆ పార్టీలోని బలాలు తెలుసుకోవాలి. ఆ బలాలపై దెబ్బ కొట్టాలి. ఇప్పుడు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో అత్యంత బలమైన నాయకుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతున్నారు. బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలో టీడీపీని నేలమట్టం చేయాలనే పట్టుదలతో రామచంద్రారెడ్డి సాగుతున్నారు. మరోవైపు పార్టీలోనూ తనదైన పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

పెద్దిరెడ్డి కుటుంబంలో ఇప్పుడు రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. తంబళ్లపల్లె లో ఆయన తమ్ముడు ద్వారకనాథరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముందు తమ్ముడికి చెక్ పెట్టేలా ఇటు వైపు నుంచి నరుక్కొద్దామని బాబు చూస్తున్నారు. అందుకే బలమైన అభ్యర్థి వేటలో పడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్ రెడ్డిని ఇక్కడ బరిలో దింపేందుకు బాబు చూస్తున్నట్లు తెలిసింది. 1985, 1994లో ప్రవీణ్ తల్లి లక్ష్మిదేవమ్మ టీడీపీ నుంచి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ప్రవీణ్ ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. కానీ ఆ పార్టీలో ఆధిపత్య పోరుకు బలి అయ్యారు. రామచంద్రారెడ్డితో విభేదించి పార్టీ వీడారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ప్రవీణ్ను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చి తంబళ్లపల్లెలో పోటీ చేయించాలని బాబు చూస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ తో లోకేశ్, అమర్నాథ్ రెడ్డి చర్చలు జరిపారని తెలిసింది.