ఎంపీ అభ్యర్ధి మారిపోయారా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజంపేటలో పోటీ చేయబోయే అభ్యర్ధి మారిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాదానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు అభ్యర్ధిగా గంటా నరహరి పోటీ చేయబోతున్నట్లు గతంలో చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగ్గట్లే నరహరి కూడా నియోజకవర్గం వ్యాప్తంగా బాగానే పర్యటించారు. అయితే తర్వాత ఏమైందో ఏమో సడెన్ గా నరహరి కామ్ అయిపోయారు.

అయితే తాజాగా రాజంపేట పార్లమెంటు అభ్యర్ధిగా సుగవాసి సుబ్రమణ్యం పేరు బలంగా వినబడుతోంది. ఈ సుబ్రమణ్యం ఎవరంటే మాజీ ఎంపీ, మాజీ ఎంఎల్ఏ సుగవాసి పాలకొండరాయుడు కొడుకే. సుబ్రమణ్యం గతంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. పాలకొండరాయుడు కడప జిల్లాలో బాగా పాపులర్. ఒకసారి రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు రాయచోటి ఎంఎల్ఏ గా పనిచేశారు. ఇపుడు సడెన్ గా సుగవాసి పేరు ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే నరహరి రాజంపేట అసెంబ్లీలో పోటీకి మొగ్గుచూపినట్లు సమాచారం.

దశాబ్దాలుగా రాజంపేట పార్లమెంట్ లో ఎక్కువగా బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులే గెలుస్తున్నారు. 1957, 62 ఎన్నికల్లోను, 2014,19 ఎన్నికల్లోను రెడ్డి సామాజికవర్గం అభ్యర్ధులు గెలిచారు. మిగిలిన 12 ఎన్నికల్లోను బలిజ అభ్యర్ధులే గెలిచారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పార్టీ+బలిజ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమే. ఇపుడు టీడీపీలో నరహరి అయినా సుగవాసి అయినా ఇద్దరూ బలిజ సామాజికవర్గం నేతలే. అయితే నరహరి ఆర్ధికంగా బాగా గట్టి స్ధితిలో ఉన్నారు. అందుకనే అన్ని కోణాల్లో ఆలోచించిన చంద్రబాబు గతంలోనే నరహరిని పార్లమెంటు అభ్యర్ధిగా ప్రకటించారు.

అయితే తర్వాత ఏమైందో ఏమో ఎవరికీ తెలీదు సడెన్ గా నరహరి వెనక్కు తగ్గినట్లు సమాచారం. అందుకనే చంద్రబాబు మరికొందరి పేర్లను పరిశీలించి సుగవాసి అయితే సరైన అభ్యర్ధి అవుతారని అనుకున్నట్లున్నారు. అందుకనే ఈమధ్యనే జరిగిన సమీక్షా సమావేశంలో సుగవాసిని పోటీకి రెడీగా ఉండమని హింట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. సుగవాసే గనుక అభ్యర్ధి అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున మిథున్ రెడ్డిని ఎదుర్కోవాల్సుంటుంది.