150 మందిని మార్చినా గెలవవు జగన్: చంద్రబాబు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలపై దృష్టి సారించారు. ఏపీలో వైసిపి మరోసారి అధికారం చేపట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా…ఎలాగైనా అధికారంలోకి రావాలని టిడిపి కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు…సీఎం జగన్, వైసీపీ నేతలపై సంచలన విమర్శలు చేశారు.

మార్చి తర్వాత ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారని చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓడిపోతామన్న భయంతోనే 11 మంది సిట్టింగ్ నేతలను జగన్ మార్చారని, 150 మందిని మార్చినా గెలవవు జగన్ అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఒకచోట చెల్లని కాసు మరోచోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు సెటైర్లు వేశారు. బీసీల జపం చేస్తున్న జగన్ కు పులివెందుల టికెట్ బీసీలకు కేటాయించే దమ్ముందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, మార్చినాటికి అది మరింత పెరుగుతుందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కొందరు వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని చంద్రబాబు అన్నారు.

భరిస్తున్నారని ప్రజలను వేధించడం దుర్మార్గం, నీచం అని…. తనను ఎన్నుకున్న ప్రజలకు ధర్మకర్తలా ఉండాల్సింది పోయి నియంతలా మారారని విమర్శించారు. రాబోయేవి టీడీపీ-జనసేన ఎన్నికలు కావని, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అని చెప్పారు. అమాయకులైన కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, లోకేష్ కోసం వెళ్లడం బీటెక్ రవి చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, తెలుగుజాతి గెలవాలి అని పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయాలు తీసుకుని… ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలో నిర్ణయించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. అందుకోసం టెక్నాలజీలను కూడా వినియోగించుకుంటానన్నారు.

అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పు చేయనని అన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సరికొత్త విధానాన్ని ఈ సారి అవలంబిస్తున్నానని, అభ్యర్థుల సమాచారం తన వద్ద తప్ప మరెవరి వద్దా ఉండదని చెప్పారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయని, పార్టీలు, రాజకీయ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా త్యాగం చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.