చంద్రబాబుకు పోలీసుల నోటీసులు…కారణమిదే

ఏపీలో శాంతి భద్రతలు రోజురోజుకీ క్షీణించి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులు ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చాయని, ఏపీలో బడుగుబలహీన వర్గాల వారిపై దాడులు ఎక్కువయ్యాని ఆ లేఖలో చంద్రబాబు ఆరోపించారు. దీంతోపాటు, పుంగనూరులో జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై దాడి వ్యవహారం, పుంగనూరులో ఇటీవల ఇద్దరు దళిత యువకులు ఓం ప్రతాప్, ఎం. నారాయణలు అనుమానాస్పదంగా మరణించారని ఆరోపించారు. పుంగనూరులో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందనేందుకు ఈ దుర్ఘటనలే దుష్ట్యాంతాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు పోలీసులు సీఆర్పీసీ 91 నోటీసులు జారీ చేశారు. పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించిన సాక్ష్యాధారాలు సమర్పించాలని నోటీసులో మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్డీపీవో) పేర్కొన్నారు.

ఓం ప్రతాప్ మృతిపై డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు రాసిన లేఖ ఇపుడు చర్చనీయాంశమైంది. ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఓం ప్రతాప్ మృతికి సంబంధించి సాక్షాధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆగస్ట్ 27న దినపత్రికల్లో వచ్చిన కథనాన్ని నోటీసులో పోలీసులు ప్రస్తావించారు. చంద్రబాబు దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాధారాలను అందజేయాలని చంద్రబాబును మదనపల్లి ఎస్డీపీవో కోరారు. అంతేకాకుండా, నోటీసు అందిన వారం రోజుల లోపు, తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కాగా, ఇటీవల ఏపీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని, ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఆధారాలుంటే సమర్పించాలంటూ చంద్రబాబును డీజీపీ సవాంగ్ కోరారు. ఇపుడు, తాజాగా మరోసారి అదే తరహాలో ఓం ప్రతాప్ మృతిపై ఆధారాలుంటే సమర్పించాలని కోరడం చర్చనీయాంశమైంది. మరి, ఈ తాజా లేఖపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.