తడిచిన పైరును పట్టుకోలేరా జగన్?: సీపీఐ రామకృష్ణ

మిచౌంగ్ తుపాను ధాటికి ఏపీలోని 15 జిల్లాల్లో 10 వేల కోట్ల రూపాయల విలువైన పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, తుపాను వల్ల వరి పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్లిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. రోడ్డు మీద టెంటు వేసుకొని…ఆ పక్కన బారికేడ్లు పెట్టుకొని రైతులను దూరంగా ఉంచిన వైనంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ 440 మండలాల్లో కరవు ఉందని, దానికి తోడు మిచౌంగ్ తుపాను విలయ తాండవం చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని నిప్పులు చెరిగా. రైతాంగం పూర్తిగా నష్టపోయినా…పట్టించుకోని సీఎంకు సిగ్గుందా అని ప్రశ్నించారు.

మిచౌంగ్ తుపాన్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్నికలకు ముందు జగన్ అందరి తలపై చేయి వేసి తిరిగావు.. ఇప్పుడు పొలాల్లో దిగకుండా షో చేస్తున్నావు..” అని ఎద్దేవా చేశారు. “ఓట్లు కోసం ఎత్తులు వేశావు… అన్నివర్గాల ప్రజలను, రైతులను చిత్తు చేశావు” అని చురకలంటించారు. కరువు, తుఫాన్ ప్రాంత రైతుల పిల్లలకు ఫీజు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్, ఆయన మంత్రులు క్షేత్ర స్థాయిలో పొలాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బృందాలను కలిసి నష్టం వివరాలను అందచేస్తామని, ఢిల్లీ స్థాయిలో అందరినీ కలుపుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని రామకృష్ణ అన్నారు. జగన్ పొలాల్లో దిగకుండా…తడిచిన వరి పైరును పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడంతో రామకృష్ణ ఈ కామెంట్లు చేశారు.