‘విశాఖ’ రాజ‌కీయం.. వైసీపీకి లాభ‌మెంత‌..!

కీల‌క‌మైన విశాఖ‌ప‌ట్నాన్ని పాల‌నా రాజ‌ధానిని చేస్తామంటూ వైసీపీ ప్ర‌క‌టించ‌డం.. ద‌రిమిలా అమ‌రావ‌తి ని స‌మ‌ర్థిస్తున్న వారు దీనిపై న్యాయ పోరాటాల‌కు దిగ‌డం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. మూడు ప్రాంతాల అభివృద్ది ల‌క్ష్యంగా సీఎం జ‌గ‌న్‌.. విశాఖ‌నే రాజ‌ధానిగా చేస్తాన‌ని ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. అయితే, దీనికి న్యాయ ప‌ర‌మైన చిక్కులు పొంచి ఉన్న నేప‌థ్యంలో ముందు తాను వెళ్లి.. త‌ర్వాత మిగిలిన ప‌నులు చ‌క్క‌బెట్టే యోచ‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆఫీసుల‌ను, మంత్రుల నివాసాల‌ను విశాఖ‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనికి కూడా ఇప్పుడు హైకోర్టులో కేసులు దాఖ‌లు కావ‌డం.. విచార‌ణ‌లు కూడా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌భుత్వం పూర్తిగా త‌మ ఆఫీసుల‌ను త‌ర‌లించ‌డం లేద‌ని.. కోర్టు తీర్పుల‌ను గౌర‌విస్తామ‌ని పేర్కొంది. ఇక‌, ఈ ఎపిసోడ్‌ను మొత్తం ప‌రిశీలిస్తే..విశాఖ‌ను రాజ‌ధాని చేయాల‌న్న వైసీపీ రాజ‌కీయం.. ఎవ‌రికి మేలు చేస్తుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

మ‌రో నాలుగు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో విశాఖ‌కు వెళ్ల‌కుండా స‌ర్కారును నిలువ‌రించ‌గ‌లిగితే.. మ‌ళ్లీ తాము అధికారంలోకి వ‌చ్చేయ‌చ్చ‌నే భావ‌న ప్ర‌తిప‌క్షాల‌కు ఉండి ఉంటుంది. లేదా అమ‌రావతినే కావాల‌ని అంటున్న‌వారికి కూడా ఈ భావ‌న ఉండి ఉండొచ్చు. దీంతో వైసీపీ ప్ర‌య‌త్నాలు ఈ విష‌యంలో మంద‌కొడిగా సాగుతున్నాయి. పైకి వెళ్లిపోవాల‌ని ఉన్నా.. న్యాయ‌వ్య‌వ‌స్థ తీర్పుల‌కు అనుగుణంగా న‌డుచుకోవ‌ల్సి రావ‌డంతో ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి.

దీనిని ప్ర‌తిప‌క్షాలు టార్గెట్ చేసుకుని.. మూడు రాజ‌ధానులు అన్నారు. ఏవీ? అంటూ ప్ర‌శ్నిస్తున్నాయి. ఇది ఒక‌ర‌కంగా వైసీపీకి ఇబ్బందిక‌ర ప్ర‌శ్నే. అయిన‌ప్ప‌టికీ.. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు కూడా సాగుతున్నాయి. అడుగ‌డుగునా న్యాయ పోరాటాల‌తో త‌మ‌కు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నార‌ని.. కాబ‌ట్టి త‌ప్పు త‌మ‌ది కాద‌నే ప్ర‌చారం దిశ‌గా వైసీపీ అడుగులు వేయ‌నుంది.

ఇదే విష‌యాన్ని విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర నాయ‌కుల‌కు తాజాగా సీఎం దిశానిర్దేశం చేశారు. ఎదురు దాడి చేయ‌క‌త‌ప్ప‌ద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. సో.. విశాఖ రాజ‌ధాని అయినా.. ఇప్ప‌టికిప్పుడు కాకున్నా గెయిన్ మాత్రం వైసీపీకేన‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. మ‌రి ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.