నాయ‌కులా… పార్టీలా… ఈ సారి జై కొట్టేదెవ‌రికి… !

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌లు అత్యంత వాడివేడిగా సాగ‌నున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మించి.. ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కుతాయ‌ని.. ఎన్నిక‌లు స‌ల‌స‌ల మ‌రుగుతాయ‌ని అంటు న్నారు. ఇదిలావుంటే.. అస‌లు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు ఈ సారి ఎవ‌రిని ఎంచుకుంటారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌గా మారింది. పార్టీల‌ను చూసి ఓటేస్తారా? లేక‌.. ఎమ్మెల్య అభ్య‌ర్థుల‌ను చూసి ఓటేస్తారా? లేక పార్టీల అధినేత‌ల‌ను బ‌ట్టి ఓటెత్తుతారా? అనేది కీల‌క చ‌ర్చ‌గా మారింది.

2014, 2019 ఎన్నిక‌ల‌ను చూస్తే.. 2014లో చంద్ర‌బాబు అనే ఒకే ఒక్క నాయ‌కుడిని చూసి ప్ర‌జ‌లు ఓటేశారు. దీంతో ఆ పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన నాయ‌కులు.. బ‌ల‌హీన నాయ‌కులు కూడా.. గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, అదే స‌మ‌యంలో వైసీపీ లోనూ 67 మంది గెలిచినా.. చంద్ర‌బాబు వైపే జ‌నం నిలిచారు. సో.. దీనిని బ‌ట్టి.. అప్ప‌ట్లో విజ‌న్ ఉన్న నాయ‌కుడి వైపు జ‌నం మొగ్గారు. ఈ క్ర‌మంలో పార్టీల‌ను ప‌క్క‌న పెట్టారు.

ఇక‌, 2019 ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. రెండు విష‌యాలు ప్ర‌ధానంగా ప‌నిచేశాయి. ఒక‌టి.. నాయ‌కుడు. రెండు.. క్షేత్ర‌స్థాయి అభ్య‌ర్థులు. క్షేత్ర‌స్థాయిలో అభ్య‌ర్థుల‌పై వున్న వ్య‌తిరేక‌త కారణంగా అప్ప‌ట్లో టీడీపీకి వ్య‌తిరేకంగ జ‌నాలు ఓటేశారు. ఇక‌, వైసీపీ నాయ‌కుడిగా.. యువ నేత‌గా.. ఒక్క ఛాన్స్ అన్న జ‌గ‌న్ వైపు ప్ర‌జ‌లు మొగ్గారు. దీంతో టీడీపీ ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంది.

ఇక‌, ఇప్ప‌టి ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ నాయ‌కులు, పార్టీలు కాకుండా. మ‌రోసారి విజ‌న్ వైపే జ‌నాలు అడుగులు వేసే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. నిజానికి క్షేత్ర‌స్థాయిలో ఇటు టీడీపీ, అటు వైసీపీకి కొన్నికొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు త‌ప్ప‌.. మెజారిటీ నియోక‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థులులేరు. వారిని చూసి ఓటేసే ప‌రిస్థితి కూడా లేదు.