నిరుద్యోగ విజయోత్సవమా?

ఈనెల 30వ తేదీన ఉస్మానియా యూనివర్సిటిలో విజయోత్సవ సభ జరగబోతోంది. యూనివర్సిటిలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో నిరుద్యోగుల జేఏసీ విజయోత్సవ సభ జరపబోతున్నట్లు జేఏసీ ఛైర్మన్ భీమ్ రావు నాయక్ ప్రకటించారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ ఎందుకు జరుగుతోందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా. బీఆర్ఎస్ ఓడిపోయినందుకు నిరుద్యోగ విజయోత్సవ సభ జరగటంలో తప్పేమీలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమిలో నిరుద్యోగుల జేఏసీ పాత్ర కూడా కీలకం కాబట్టే.

పదేళ్ళు అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీల ప్రకారం కేసీయార్ నోటిపికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేయలేదు. పైగా ఉద్యోగాల భర్తీ పేరుతో నోటిఫికేసన్లు ఇవ్వటం, ప్రశ్న పేపర్లు లీకవ్వటం, నోటిఫికేషన్లు రద్దవ్వటం, కోర్టులో కేసులు దాఖలవ్వటం అందరికీ తెలిసిందే. పదేపదే నోటిఫికేషన్లు రద్దవ్వటంతో నిరుద్యోగులంతా రెచ్చిపోయారు. టీఎస్సీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని ఆందోళనలు చేసిన నిరుద్యోగులపై కేసులు పెట్టి అరెస్టు చేశారు.

కేసీయార్ ప్రభుత్వం చర్యలతో నిరుద్యోగులకు బాగా  మండిపోయింది. అందుకనే విద్యార్ధి సంఘాల నేతలు, నిరుద్యోగ జేఏసీ నేతలు నాలుగు బస్సులు వేసుకుని కేసీయార్ కు వ్యతిరేకంగా ప్రచారంచేశారు. మొత్తం 119 నియోజకవర్గాలు తిరిగి గ్రామ గ్రామాన తిరిగారు. ప్రతి గ్రామంలోను తిరిగి  బీఆర్ఎస్ కు ఓట్లు వేయద్దని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని ప్రచారం చేశారు. అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద జనాల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు నిరుద్యోగుల జేఏసీ విస్తృతంగా తిరగటం అందులోను గ్రామీణ ప్రాంతాల్లో తిరగటంతో మంచి ఫలితాలను ఇచ్చినట్లుంది.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో నిరుద్యోగ జేఏసీకి మంచి ప్రాధాన్యత దక్కినట్లుంది. అందుకనే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందుకు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ జరుగుతోంది. నిజానికి గడచిన పదేళ్ళల్లో కేసీయార్ అండ్ కో ఉస్మానియా యూనివర్సిటీ లో అడుగు కూడా పెట్టలేదు. తెలంగాణా ఉద్యమం నుండి కూడా ఎందుకనో కేసీయార్ కు ఉస్మానియా విద్యార్ధి సంఘాల నేతలకు పడటంలేదు. మొత్తానికి అన్నీ కలిసొచ్చి ఈనెల 30వ తేదీన భారీ ఎత్తున విజయోత్సవ సభ జరుపుకుంటున్నారు.