గులాబీ నేతల్లో రివ్యూల గుబులు?

రోజురోజుకు గులాబీ నేతల్లో గుబులు జరిగిపోతున్నట్లు ఉంది. కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి సమీక్షల తీరు చూస్తుంటే తొందరలోనే తాము కచ్చితంగా టార్గెట్ అవుతామని కొందరు గులాబీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందట. గడచిన మూడు రోజులుగా రేవంత్ సమీక్షలు నిర్వహించిన శాఖల్లో విద్యుత్ శాఖ చాలా కీలకమైనది. అలాగే తొందరలోనే ధరణి పోర్టల్ పనితీరుపైన కూడా సమీక్ష జరపబోతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. అక్రమాలకు కారణమైన ముగ్గురిపైన ప్రభుత్వం  కేసులు పెట్టి విచారణ మొదలుపెట్టింది.

ఈ విచారణలో తెరవెనుక ఉండి ఉద్యోగులతో పోర్టల్లో అక్రమాలు చేయించిందనే విషయం ఈపాటికే బయటపడుటుందనటంలో సందేహం లేదు. అలాగే విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో మునిగి పోయిన విషయం ఉన్నతాధికారులు బయటపెట్టారు. ఉన్నతాధికారులు చెప్పిన అప్పులను విన్న తర్వాత రేవంత్, మంత్రులకు పెద్ద షాకే తగిలింది. వివిధ కారణాలతో హోం, మున్సిపల్ శాఖలను రేవంత్ తన దగ్గరే ఉంచుకున్నారు. మున్సిపాలిటి ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములను గత ప్రభుత్వంలో కీలక నేతలు కబ్జాలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

మున్సిపాలిటీ ప్రాంతాల్లో జరిగిన భూకబ్జాలు బయట పడాలన్నా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నా చాలా గట్టిగా ఉండాలి. కేసులు, విచారణంటే పోలీసు శాఖే కీలకపాత్ర పోషించాల్సుంటుంది. అందుకనే విద్యుత్, ఫైనాన్స్, ఇరిగేషన్, రెవిన్యు శాఖలను ఇతరులకు కేటాయించినా మున్సిపల్, హోంశాఖను మాత్రం రేవంత్ తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖను కేటీయార్ చూసిన విషయం తెలిసిందే.

ఇపుడు చేసిన సమీక్షలకు తోడు తొందరలోనే అన్నీ శాఖలపైనా రేవంత్ సమీక్షించబోతున్నారు. సమీక్షలు కూడా లోతుగా జరిగితే కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలన్నీ బయటపడటం ఖాయం. అసలే రేవంత్-కేసీయార్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రేవంత్ ను ఎంత ఇబ్బంది పెట్టారో అందరు చూసిందే. కాబట్టి కేసీయార్ మీద కోపంతో ఇపుడు రేవంత్ తమపైన ఎక్కడ కఠిన చర్యలు తీసుకుంటారో అనే టెన్షన్ గులాబీ పార్టీ నేతల్లో పెరిగిపోతోందట. మరి రేవంత్ ఏమిచేస్తారో చూడాలి.