వైసీపీలో ర‌గులుతున్న కుంప‌ట్లు.. ఆర్పేదెవ‌రు…?

రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా కుంప‌ట్లు ర‌గులుతూనే ఉన్నాయి. కాద‌న్నా..ఔన‌న్నా.. ఈ విష‌యాలు అధిష్టానానికి కూడా తెలుసు. అయినా.. వాటిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం మాత్రం ఎక్క‌డా జ‌ర‌గ‌డం లేదు. ఎవ‌రినీ క‌దిలించలేని ప‌రిస్థితి.. ఎవరినీ కాద‌న‌లేని ప‌రిస్తితి నెల‌కొంది. దీంతో మీరు మీరు తేల్చుకోండి.. త‌ర్వాత‌.. మా ద‌గ్గ‌ర‌కు రండి! అన్న‌ట్టుగా అధిష్టానం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వినుకొండ‌లో ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడును కాద‌ని.. ఓ వ‌ర్గం నాయ‌కులు న‌న్న‌ప‌నేని సుధ‌ను రం గంలోకి తెచ్చాయి. ఈ వివాదం రోజు రోజుకు ముదురు తోంది. అంతేకాదు.. బొల్లాకు వ్య‌తిరేకంగా కార్య‌క్ర మాలు చేప‌డుతున్నారు. ఇది అంతిమంగా వైసీపీనే దెబ్బేస్తోంది. దీనిపై దృష్టి పెట్టే విష‌యంలో అధిష్టానం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. సామాజిక సాధికార యాత్ర జ‌రిగినా.. ఎమ్మెల్యే బొల్లా బ‌ల నిరూప‌ణ చేసుకోలేక‌పోయార‌నే వాద‌న వినిపించింది.

ఏదో సో..సో..గా ఈ యాత్ర ముగిసిపోయింది. కీల‌క నాయ‌కులు ఈ యాత్ర‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, గుర‌జాల‌లోనూ ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డికి, బీసీ నాయ‌కుడు, ఎమ్మె ల్సీ జంగా కృష్ణ మూర్తికి ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్తితి క‌నిపిస్తోంది. దీంతో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు జోరుగా సాగుతున్నాయి. ఫ‌లితంగా ఇక్క‌డ సామాజిక సాధికార బ‌స్సు యాత్ర నిలిచిపోయింది. ఈ యాత్ర‌కు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఎమ్మెల్యే దీనిని వాయిదా వేసుకున్నారు.

తాడికొండ‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. గెలిచిన ఎమ్మెల్యే టీడీపీకి జైకొట్ట‌గా.. ఇక్క‌డ ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మ‌ల్సీ డొక్కా మాణిక్యానికి నాయ‌కులు స‌హ‌క‌రించ‌డం లేదు. పార్టీలు మారుతున్న‌వారికి ఇస్తున్న ప్రాధాన్యం త‌మ‌కు లేకుండా పోయింద‌ని క్షేత్ర‌స్థాయి నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్క‌డ‌కూడా యాత్ర పేరు ఎత్తేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.