తెలంగాణ‌లో ప‌ట్ట‌ణాలు.. ఏపీలో ప‌ల్లెలు!


తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. అధికార పార్టీ బీఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోయింది. 2018లో 88 స్థానాలు ద‌క్కించుకు న్న ఈ పార్టీ.. తాజా ఎన్నిక‌ల్లో 36 స్థానాల‌కు ప‌డిపోయింది. ఈ ప‌రిణామం.. ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయింది. అధికార పార్టీ వైసీపీ నుంచి చిన్నా చిత‌కా పార్టీల వ‌ర‌కు.. అన్నిపార్టీల‌దీ ఇదే చ‌ర్చ‌. అయితే… ముఖ్యంగా ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ మ‌రో విధంగా ఉంది. తెలంగాణ ప‌ల్లెల్లో కాంగ్రెస్ వికాసం క‌నిపించింది.

కానీ, హైద‌రాబాద్‌,రంగారెడ్డి వంటి కీల‌క ప‌ట్ట‌ణాల్లో మాత్రం బీఆర్ ఎస్ దూకుడు చూపించింది. అంటే ఒక‌ర‌కంగా.. ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాలు చెప్ప‌డంలో నిర్ణ‌యాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయార‌నే వాద‌న ఉంది. ఇటు ప‌ట్ట‌ణాల్లో బీఆర్ ఎస్ గెలిస్తే.. అటుప‌ల్లెలు, గ్రామాల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. రైతు బంధు ప‌థ‌కాన్ని రూ.15000ల‌కు పెంచ‌డం.. బాగా ప‌నిచేసింద నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ ప‌రిస్థితి ఏంటి? ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో ఓటు బ్యాంకు ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు రెండు ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో జ‌రుగుతున్న కీల‌క చ‌ర్చ.

ఏపీలో తెలంగాణ ఫ‌లితానికి భిన్న‌మైన ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే లెక్క‌లువ స్తున్నాయి. అంటే.. ఏపీలో ప‌ల్లెలు, గ్రామాల్లో వైసీపీకి అనుకూలంగా ఉందని ఒక వ‌ర్గం చెబుతోంది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో మాత్రం వైసీపీకి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని అంటున్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ముఖ్యంగా ర‌హ‌దారుల దుస్తితి, ప‌ట్ట‌ణ ఓటు బ్యాంకులో స్థిర‌త్వం లేక‌పోవ‌డం.. వంటివి రీజ‌న్లుగా క‌నిపిస్తున్నాయి. దీనిని బ‌ట్టి.. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాన్ని గ్రామీణులు ఆహ్వానిస్తే.. ఇక్క‌డ ప‌ట్ట‌ణాల్లో టీడీపీని ఆహ్వానించే ప‌రిస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు.

అయితే.. అలా కాదు, రెండు చోట్ల కూడా.. మేమే బ‌లంగా ఉంటామ‌నిటీడీపీ భావిస్తోంది. ప‌ల్లెల్లో కూడా.. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, క‌రెంటు చార్జీల మోత‌, స‌ర్పంచుల‌కు నిధులు లేకుండా చేయ‌డం వంటి ప‌రిణామాలు వైసీపీకి అశ‌నిపాతంగా మారాయ‌ని.. కాబ‌ట్టి గ్రామీణ ఓటు బ్యాంకు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు.. ప‌ట్ట‌ణ ఓట‌ర్లు స్థిరంగా ఉండ‌రు కాబ‌ట్టి.. వారిని లెక్క‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌ధానంగా గ్రామీణ ఓటు బ్యాంకుపైనే దృష్టి పెట్టాల‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ‌లో వ‌చ్చిన ఓటు బ్యాంకుపై ఇరు పార్టీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి.