పెరిగిపోతున్న బెట్టింగుల హోరు

ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడే కొద్దీ బెట్టింగుల హోరు, జోరు పెరిగిపోతోంది. నవంబర్ 30వ తేదీన జరిగిన పోలింగ్ కు డిసెంబర్ 3వ తేదీ అంటే ఆదివారం నాడు కౌంటింగ్ జరగబోతోందని తెలిసిందే. పోలింగుకు ముందే మొదలైన బెట్టింగ్ రాయళ్ళ హడావుడి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలతో బాగా ఊపందుకున్నది. బెట్టింగంతా ముఖ్యంగా రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కేంద్రంగానే జరుగుతోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం బెట్టింగ్ మొత్తం సుమారు వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందట.

ఇందులో ప్రధానంగా పై రెండుపార్టీల్లో అధికారంలోకి వచ్చేది ఏది ? అన్న విషయమై బెట్టింగులు జరుగుతున్నాయి. అలాగే గజ్వేలు, కామారెడ్డిలో కేసీయార్ గెలుపోటములు, మెజారిటి, రేవంత్, ఈటల గెలుపోటములు, వాళ్ళకి వచ్చే ఓట్లపైన బెట్టింగులు పెరిగిపోతున్నాయి. అలాగే మరికొందరు ప్రముఖుల గెలుపోటములపైన కూడా బారీగా బెట్టింగులు జరుగుతున్నాయట. ప్రముఖుల బెట్టింగుల్లో ముఖ్యంగా కేటీయార్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి తదితరులపైన బెట్టింగులు జరుగుతున్నాయి.

ఈ బెట్టింగులు భీమవరంలోనే సుమారు రు. 300 కోట్లు దాటిపోయిందట. ఇక ఖమ్మంకు ఆనుకుని ఉండే విజయవాడలో కూడా భారీ ఎత్తునే జరుగుతున్నట్లు సమాచారం. ఎనిమిది సీట్లలో పోటీచేసిన జనసేన గెలవబోయే సీట్లపైన కూడా బెట్టింగులు జరుగుతున్నాయట. అయితే ఇది చాలా తక్కువ మొత్తంలోనే జరుగుతున్నట్లు సమాచారం. జనసేనపైన జరుగుతున్న బెట్టింగులు ఏమిటంటే అభ్యర్ధుల్లో ఎంతమందికి డిపాజిట్లు వస్తాయనేది ముఖ్యం. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీచేసిన బర్రెలక్క (శిరీష)కు రాబోయే ఓట్లపైన కూడా కొందరు బెట్టింగులు కడుతున్నారట.

ఏదేమైనా ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే తెలంగాణా ఎన్నికల ఫలితాలపై ఏపీలో ఎక్కువగా బెట్టింగులు జరుగుతుండటమే. నిజానికి తెలంగాణాలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఏపీకి ఒరిగేదేమీ లేదు. అయినా భారీ ఎత్తున బెట్టింగులు జరిగిపోతున్నాయంటే ఇదో వ్యసనంలాగ మారిపోయిందని అర్ధమవుతోంది. లేకపోతే లక్షకు రెండు లక్షలు, కోటికి రెండు కోట్లు ఎవరైనా బెట్టింగులు కడతారా ?