ఓటేసిన క‌విత‌.. కామెంట్సే వివాదం.. కాంగ్రెస్ రెడీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ఈ రోజు(గురువారం) ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌శాంతంగా ప్రారంభ‌మైంది. ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే.. ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు క్యూలైన్ల‌లో నిల‌బ‌డ్డారు. సినీ రంగం నుంచి రాజ‌కీయ రంగం, పారిశ్రామిక రంగాల‌కు చెందిన దిగ్గ‌జాలు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

అయితే.. ఓటు వేసిన అనంత‌రం.. క‌విత మాట్లాడిన వ్యాఖ్య‌లు వివాదానికి దారితీస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. ఎన్నిక‌ల సంఘానికిఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యా రు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం క‌విత మీడియాతో మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశ ప్రగతి కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ముఖ్యంగా యూత్‌ తప్పకుండా ఓటు వేయాలన్నారు.

ఇదేస‌మ‌యంలో తెలంగాణ‌లో మూడో సారి కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో మూడోసారి వ‌రుస‌గా ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశం కేసీఆర్‌కు క‌ల్పించాల‌ని ఆమె విన్న‌వించారు. కారు గుర్తుకు ఓటేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అభివృద్ధి చేస్తున్న పార్టీని, నాయ‌కుడిని గెలిపించాల‌ని కూడా ఆమె విన్న‌వించారు. పెద్ద ఎత్తున యువ‌త త‌ర‌లి వ‌చ్చి కారు గుర్తుకు ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని విన్న‌వించారు.

అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత‌.. ఇలా ఒక పార్టీకిఓటేయాల‌ని కానీ.. ఒక పార్టీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌డం ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. పైగా.. పోలింగ్ ప్రారంభ‌మైన స‌మ‌యంలో అస‌లు ఎవ‌రూ కూడా ఒక పార్టీకి ఓటేయాల‌ని కోర‌కూడ‌దు. అందునా ఒక ఎన్నిక‌ల గుర్తును పేర్కొంటూ.. దానికే ఓటేయాల‌ని చెప్ప‌డం.. ఎన్నిక‌ల నిబంధ‌న‌లను పూర్తిగా ఉల్లంఘించిన‌ట్టేన‌ని కాంగ్రెస్ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

దీనిపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి క‌విత చేసిన కామెంట్లు ఎలాంటి దుమారానికి దారి తీస్తాయో చూడాలి. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి అంబ‌ర్‌పేట‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అయితే.. ఆయ‌న మీడియాతో మాట్లాడ‌కుండా.. మౌనంగా వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.