పూజ‌లు-ప్రార్థ‌న‌లు-ప్ర‌చారాలు : మోడీ స‌మ‌గ్ర రూపం!

పైకి ఏమీ చెప్ప‌రు. వ్యూహం ఏంటో పెద‌వి దాట నివ్వ‌రు. కానీ, ప‌ని మాత్రం జ‌రిగిపోతుంది. అంతా ప‌క్కా స్కెచ్చే.. ప‌క్కా ప్ర‌ణాళికే. ఎక్క‌డా తేడారాదు. తేడా లేదు. ఇదీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్లాన్ అంటే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వ‌చ్చిన ఆయ‌న తిరుమ‌ల‌కు వెళ్తార‌ని ఎవ‌రైనా అనుకున్నారా? అస‌లు నిముషం కూడా తీరిక‌లేని ఈ స‌మ‌యంలో అందునా.. అధికారం లోకి రావాలని ల‌క్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రం నుంచి.. ప్ర‌చారానికి తుదిగ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ స‌మ‌యంలో ఎవ‌రైనా ఒక్క అడుగు బ‌య‌ట‌కు వేస్తారా? ఎవ‌రి సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌ధాని మోడీ మాత్రం అలానే చేశారు.

చాలా వ్యూహాత్మ‌కంగా ఆయ‌న తిరుమ‌ల ప‌ర్య‌ట‌న పూర్తి చేశారు. ఇక‌, అక్క‌డ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. రోడ్ షోల్లో పాల్గొన్నారు. క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌ల‌లో ప్ర‌సంగాలు దంచి కొట్టారు. మ‌ధ్యంలో మ‌రో ప‌ని కూడా చేశారు. సిక్కులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో వారిని మ‌చ్చిక చేసుకోవాల‌ని అనుకున్నారో.. ఏమో.. వెంట‌నే వారికి సంబంచి.. అమీర్ పేట‌లో ఉన్న గురుద్వారాను కూడా ద‌ర్శించుకున్నారు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. దాదాపు అర‌గంట అక్క‌డే గ‌డిపారు. మ‌ళ్లీ ప్రచార ర‌థం ఎక్కేశారు.

ఇదీ.. ఒకే రోజు(సోమ‌వారం) కేవ‌లం 10 నుంచి 12 గంట‌ల వ్య‌వ‌ధిలో ప్ర‌ధాని మోడీ చూపించిన స‌మ‌గ్ర స్వ‌రూపం. తిరుమ‌ల ఆల‌యానికి వెళ్ల‌డం ద్వారా.. ఆయ‌న ఇచ్చిన ప్ర‌ధాన సందేశం.. హిందూ ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డ‌మేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. లేక‌పోతే.. ఇంత బిజీషెడ్యూల్ స‌మ‌యంలో తిరుమ‌ల‌కు ఇంత ప్రాధాన్యం ఇవ్వ‌డం ఎందుక‌నేది వారి ‘ధ‌ర్మ’ సందేహం. ఇక‌, ఇదేస‌మ‌యంలో గురుద్వారాని ద‌ర్శించి ప్రార్థ‌న‌లు చేశారు. అనంత‌రం.. అటు నుంచి మ‌ళ్లీ ప్రచారంలోకి వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే.. పూజ‌లు-ప్రార్థ‌న‌లు-ప్ర‌చారాల‌తో మోడీ.. స‌మ‌గ్ర స్వ‌రూపం చూపించార‌నేది నెటిజ‌న్ల టాక్‌. ఈ విన్యాసాల‌న్నీ.. తెలంగాణ ఎన్నిక‌ల కోస‌మేన‌ని అంటున్నారు.