తెలంగాణ‌లో పోలింగ్.. ఏపీలో చ‌లి జ్వ‌రం…!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతుంటే.. ఏపీలో మాత్రం చ‌లీ జ్వ‌రం ప‌ట్టుకున్న విధంగా ప‌రిస్థితి మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అక్క‌డ ఎన్నిక‌ల‌ను ఏపీకి చెందిన కీల‌క పార్టీలు చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్నాయి. తెలంగాణ‌లో పోలింగ్ ప్ర‌క్రియ‌ను, ప్ర‌చారాన్ని కూడా. ఏపీ పార్టీలు అంచ‌నాలు చేస్తున్నాయి. అదేంటి.. ఎందుకు అనుకుంటున్నారా? తెలంగాణ‌లో గెలిచే పార్టీ వ‌ల్ల వ‌చ్చే ఏడాది జ‌రిగే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ఉంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డ‌మే!

ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీని ప‌క్క‌కు పెట్టి.. తాము అధికారంలోకి రావాల‌ని టీడీపీ-జ‌న‌సేన భావిస్తున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2024ను జార‌విడుచుకోరాద‌ని భావిస్తున్నాయి. ఇక‌, వైసీపీ కూడా.. ఒక్క‌చాన్స్ స్థానంలో రెండో చాన్స్ కోసం త‌పిస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ అధికారం నిల‌బెట్టుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ ఇక్క‌డ విజ‌యం దక్కించుకోవాల‌న్నా.. తెలంగాణ‌లో ఏర్ప‌డే ప్ర‌భుత్వం కీల‌కం.

తెలంగాణ‌లో ఏర్ప‌డే ప్ర‌భుత్వం ఏపీ రాజ‌కీయాల‌ను ఒకింత వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తుందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. స‌రిహ‌ద్దు జిల్లాలు, రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని సెటిల‌ర్లు, వారి బంధువ‌ల ఓటు బ్యాంకును కూడా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉందని అంటున్నారు. అందుకే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీపై ప్ర‌భావం చూపుతుంద‌ని లెక్కలు వ‌స్తున్నాయి. తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌స్తే.. ఏపీలో జ‌గ‌న్‌కు సాయం చేసే అవ‌కాశం క‌చ్చితంగా ఉంద‌ని అంటున్నారు.

ఒక‌వేళ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. ఉభ‌య కుశ‌లోప‌రిగా.. ఏపీలో టీడీపీ-జ‌నసేన‌ ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. అంతేకాదు.. ఏపీలో గెలిచే పార్టీకి తెలంగాణ స‌రిహ‌ద్దు జిల్లాల ఓటు బ్యాంకు కీల‌క‌మైన నేప‌థ్యంలో తెలంగాణలో త‌మ‌కు అనుకూల ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌నేది ఏపీలోని అధికార , ప్ర‌తిప‌క్ష పార్టీల వాద‌న‌. అయితే.. ఎవ‌రూ పైకి ఏమీ అన‌డం లేదు. కానీ.. అంతా మౌనంగా.. తెర‌చాటున స‌హ‌కారం.. న‌డిచిపోతుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. తెలంగాణ‌లో ఎన్నిక‌లు.. ఏపీలో చ‌లి జ్వ‌రాన్ని తెప్పిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.