పీవీ గురించి ప్రియాంకా గాంధీకేం తెలుసు?: కేటీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసేందుకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటేనంటూ ఓటుకు నోటు కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ చెబుతుందని, ఆ పార్టీని గెలిపిస్తే అంతే సంగతులని ఎద్దేవా చేశారు.

6 నెలలకోసారి ముఖ్యమంత్రిని మార్చడమే ఆ పార్టీకి తెలిసిన మార్పు అని చురకలంటించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్ కౌంటర్లు, అరాచకాల పాలన అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మరోసారి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చావు అంచుల వరకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ కేసీఆర్ సాధించుకున్నారని, 14 ఏళ్లపాటు ఢిల్లీలోని రాక్షసులతో పోరాడమని గుర్తు చేసుకున్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధ్యంకాని పనులను తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసి చూపించామన్నారు. తమ పార్టీపై కొందరు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పారు. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదని, కానీ, తెలంగాణలో కేసీఆర్ ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇక, తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ప్రియాంక గాంధీకి ఏమాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఆయనకు ఎంతో అన్యాయం చేసిందని కేటీఆర్ అన్నారు. పీవీని మనందరం అభిమానిస్తామని, ఆయన భూమి పుత్రుడని, ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకే సేవ చేశారని అన్నారు.