అమిత్ షా రోడ్ షో.. రెచ్చిపోయిన దొంగ‌లు.. జేబులు ఖాళీ

కీల‌క నాయ‌కులు వ‌స్తే.. పోలీసులు ఏర్పాటు చేసే భ‌ద్ర‌త సెప‌రేట్గా ఉంటుంది. ఈగ‌ను, దోమ‌ను కూడా ద‌రి చేర‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటారు. అయితే.. తాజాగా దేశం మొత్తానికి బాధ్య‌త వ‌హించే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న స‌భ‌లోనే భ‌ద్ర‌త లోపాట్లు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాయి. దీంతో దొంగ‌లు, చైన్ స్నాచ‌ర్లు రెచ్చిపోయారు. జేబులు కొట్టేశారు.. మెడ‌ల్లో ఉన్న హారాలు దోచేశారు. దీంతో అమిత్ షా పాల్గొన్న స‌భ‌ల్లో తీవ్ర గంద‌ర‌గోళం చెల‌రేగింది. ఇక‌, ఈ విష‌యం ఆయ‌న దాకా వెళ్ల‌డంతో హైద‌రాబాద్ సీపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి నాలుగు రోజుల పాటు విస్తృతంగా ప‌ర్య‌టించి.. బీజేపీ అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం చేసేందుకు అమిత్‌షా హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో తొలి రోజు శేరిలింగంప‌ల్లి, అంబ‌ర్ పేట‌ల‌లో ఆయ‌న స‌భ‌లు, రోడ్ షోలో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. తొలిగా.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ల‌న్నీ కిక్కిరిసిపోయాయి. బీజేపీనాయ‌కులు.. పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించారు.

ఇక‌, ఇదే మంచి స‌మ‌యం అనుకున్నారో.. ఏమో.. ఈ రోడ్ షో లో జేబుదొంగలు, చైన్ స్నాచర్స్ హల్‌చల్ చేసి పర్సులు చోరీ చేశారు. ఏకంగా బీజేపీ వార్డు స్థాయి నాయ‌కుల ప‌ర్సులు కూడా దోచుకుపోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఓ మహిళ మెడలో గొలుసును దొంగ లాగుతుండగా ఆమె గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఇక‌, బీజేపీ నేత రాముల్ నాయ‌క్ జేబులోని సెల్ ఫోన్ దొంగిలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్ద‌రినీ పీఎస్‌కు తరలించారు.

రోడ్ షో లో పాల్గొనడానికి వస్తే తమ జేబులు ఖాళీ చేశారని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విష‌యం ఆనోటా ఈనోటా అమిత్‌షాకు తెలిసింది. దీంతో ఆయ‌న హైద‌రాబాద్ సీపీపై ఫైర్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఇప్పుడు తేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రోడ్ షోలో దొంగ‌లెవ‌రో .. దొర‌లెవ‌రో.. గుర్తించే ప‌ని చేప‌ట్టారు.