స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనారోగ్య కారణాల రీత్యా, కాటరాక్ట్ ఆపరేషన్ రీత్యా ఆయనకు కొద్దిరోజుల క్రితం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందే, చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఎట్టకేలకు స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా హైకోర్టు తీర్పునిచ్చింది. చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. మరోవైపు, చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై వాదనలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.

దీపావళి సెలవుల నేపథ్యంలో ఆ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. రేపోమాపో ఆ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబుకు తాజాగా రెగ్యులర్ బెయిల్ లభించడం భారీ ఊరటనిచ్చిందని టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు, పైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు, లిక్కర్ షాపుల కేసులో చంద్రబాబుకు ముందస్తు, రెగ్యులర్ బెయిల్ ల పిటిషన్లపై వాదనలు పూర్తి కాలేదు.