అల‌సి.. సొల‌సి.. సొమ్మ‌సిల్లిన క‌విత‌..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాయ‌కులు త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు తింటున్నారో తిన‌డంలేదో కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం మంచి నాళ్ల‌తోనే గ‌డిపేస్తున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం త‌న‌య‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు.

జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలోని ఇటిక్యాలలో నిర్వ‌హించిన‌ రోడ్‌షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పి పడిపోయా రు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు కవిత గురయ్యారు. వెంట‌నే స్థానిక వైద్యుడు ఒక‌రు చేరుకుని ఆమెకు ప్రాథ‌మిక చికిత్స చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన‌ట్టు వైద్యుడు తెలిపారు. అనంత‌రం.. అక్క‌డే కొంత సేపు క‌విత విశ్రాంతి తీసుకున్నారు.

ఆరోగ్యంగానే ఉన్నా..

కాగా, త‌న ప‌రిస్థితిపై క‌విత ఎక్స్ వేదిక‌గా స్పందించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. విశ్రాంతి తీసుకు నే స‌మ‌యంలో చిన్నారితో కాసేపు ముచ్చటించా. తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నా” అని ఆమె పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఇదిలావుంటే.. రెండు రోజుల కింద‌ట మంత్రి మ‌ల్లారెడ్డి కూడా క‌ళ్లు తిరుగుతున్నాయంటూ.. ప్ర‌చారంలో చెప్పుకొచ్చారు.

వెంట‌నే మ‌ల్లారెడ్డికి ఆయ‌న అనుచ‌రులు సోడా, కొబ్బ‌రి బోండాం నీళ్లు అందించారు. కొద్ది సేప‌టి త‌ర్వాత‌.. ఆయ‌న తేరుకున్నారు. మ‌రికొంద‌రు నాయ‌కులు త‌మ వెంట ప్రాథ‌మిక ఔష‌ధాల‌ను ఉంచుకుంటున్నారు. వీటిలో ఓఆర్ ఎస్‌, బీపీ, షుగ‌ర్‌, గాయాల‌కు మందుల‌ను తెచ్చుకుంటున్నారు.