రేవంత్ పై ప్రత్యేక నిఘా

ఎన్నికలన్నాక ఇంటెలిజెన్స్ విభాగం అందరిపైనా నిఘావేయటం చాలా మామూలే. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం అవసరమైతే కొందరిపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టడం కూడా చాలా సహజం. ఇపుడు ఇదంతా ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిఘా అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు సమాచారం. ఒకవైపు కేసీయార్ రోజుకు మూడు, నాలుగు బహిరంగసభల్లో మాట్లాడుతున్నారు. ఇదేపద్దతిలో రేవంత్ కూడా మూడు, నాలుగు బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నారు.

రేవంత్ ప్రతి సభలోను ఏదో ఒక కొత్త సబ్జెక్టును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పనిలోపనిగా కేసీయార్ ను ప్రత్యేకంగా ఎటాక్ చేస్తున్నారు. పదేళ్ళ పరిపాలనలో కేసీయార్ వైఫల్యాలను ప్రధానంగా పదేపదే ఎత్తి చూపుతున్నారు. దాంతో జనాలు విపరీతంగా సానుకూలంగా స్పందిస్తున్నారు. సహజంగానే రేవంత్ మంచి మాటకారని అందరికీ తెలిసిందే. ఏ విషయం మాట్లాడినా మంచి అథారిటితో దూకుడుగా మాట్లాడుతారు. సెటైర్లు వేస్తు, సామెతలు చెబుతు ప్రత్యర్ధులు ప్రధానంగా కేసీయార్ ను టార్గెట్ చేయటంలో రేవంత్ స్టైల్ వేరుగా ఉంటుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్, బ్యారేజి కుంగుబాటు, థరణి పోర్టల్లో అవతకవకలు, కేసీయార్ ఫ్యామిలి అవినీతికి పాల్పడిందని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రత్యేక పాత్ర లాంటి అనేక అంశాలపై రేవంత్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ ఆరోపణలను జనాలు కూడా బాగా స్పందిస్తున్నారు. ఇలాంటి విషయాలను నిఘా అధికారులు ప్రత్యేకంగా రోజువారి రిపోర్టులు తయారుచేసి ప్రభుత్వ పెద్దలకు పంపుతున్నారట. రేవంత్ ఏ విషయాన్ని ప్రస్తావిస్తుంటే జనాలు ఏ విధంగా స్పందిస్తున్నారు ? బహిరంగసభకు ముందు సభ తర్వాత రేవంత్ స్పీచులపై జనాల స్పందన ఎలాగుంది, అభిప్రాయాలను నిఘా అధికారులు సేకరిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.

కేసీయార్ ను రేవంత్ వ్యక్తిగతంగా ఆరోపణలతో ఎటాక్ చేస్తున్నపుడు, కేసీయార్ ఆరోపణలకు రేవంత్ సమాధానాలు చెబుతున్నపుడు జనాల స్పందన చాలా ఎక్కువగా ఉంటోందని నిఘావర్గాలు రిపోర్టులో చెబుతున్నట్లు సమాచారం. రేవంత్ తన ప్రసంగంలో ఎక్కువగా తనను తాను ఫోకస్ చేసుకోవటం కన్నా పార్టీతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంకలనే ప్రస్తావిస్తున్నారు. ఇది కూడా జనాల్లో బాగా సానుకూలంగా వెళుతోందట. మరి నిఘావర్గాల రిపోర్టులు ఏమవుతాయో చూడాలి.