ధరణి వివాదంలో కేసీయార్ ఇరుక్కున్నారా ?

తెలంగాణా ఎన్నికల్లో పార్టీలు ప్రస్తావిస్తున్న అనేక అంశాల్లో ధరణి పోర్టల్ కూడా ఒకటి. రైతుల వ్యవసాయ భూమితో పాటు మామూలు జనాలకు ఉండే ప్లాట్ల వివరాలు కూడా ధరణి పోర్టల్లో నమోదవుతున్నాయి. ధరణి పోర్టలంతా తప్పుల తడకని కాంగ్రెస్ గోల చేస్తోంది. ఈ పోర్టల్లో లక్షలాది మంది భూయజమానులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని పదేపదే ప్రకటిస్తోంది.

అయితే ధరణిపోర్టల్ భూయజమాలకు అద్భుతమని కేసీయార్, మంత్రులు కేటీయార్, హరీష్ రావులు ఎదురుదాడులు చేస్తున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ సంజీవని మందు లాంటిదని కేసీయార్, కేటీఆర్, హరీష్ పదేపదే చెబుతున్నారు. ధరణిని రద్దుచేస్తామని చెబుతున్న కాంగ్రెస్ కు ఓట్లేస్తారా అని కేసీయార్ నిలదీస్తున్నారు. వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా తాజాగా ఒక విషయం బయటపడింది. అదేమిటంటే ధరణిపోర్టల్ లో కేసీయార్ భూ వివరాలే తప్పుగా నమోదయ్యాయని. కేసీయార్ కు ఉండాల్సిన దానికన్నా ఒక గుంట భూమి ఎక్కువగా నమోదైంది.

ఈ విషయం అఫిడవిట్లో స్వయంగా కేసీయారే అంగీకరించటం గమనార్హం. లక్షలాది మంది యజమాల భూవివరాలను ఉండాల్సిన దానికన్నా తక్కువ రికార్డు చేస్తున్నపోర్టల్ కేసీయార్ కు మాత్రం ఒక గుంట ఎక్కువగా రికార్డు ఎలా చేసిందని జనాలు నిలదీస్తున్నారు. పైగా ఎక్కువగా నమోదైన ఒక గుంటను తీసేసి వివరాలను ఫ్రెష్ గా నమోదచేయాలని మూడేళ్ళుగా అడుగుతున్నా రికార్డులు సరిచేయలేదని అఫిడవిట్లో కేసీయారే అంగీకరించారు.

పాస్ బుక్ ప్రకారం ఉండాల్సిన 53 ఎకరాల 30 గుంటలకు గాను ధరణిపోర్టల్లో 53 ఎకరాల 31 గుంటలుగా నమోదైనట్లు కేసీయార్ అంగీకరించారు. ముఖ్యమంత్రి భూ వివరాలను తప్పుగా నమోదోచేసిన ధరణి పోర్టల్ ఇక సామాన్య జనాల భూవివరాలను ఇంకెన్ని తప్పులతో రికార్డు చేస్తుందో చూడాలని జనాల్లో చర్చలు మొదలైపోయాయి. నిజానికి పోర్టల్లో భూ వివరాలు తప్పులు దొర్లినట్లు లక్షలాది మంది భూయజమానాలు మొత్తుకుంటున్నా కరెక్షన్లు జరగటంలేదు. ఇపుడు పోర్టల్లో తప్పులు కేసీయార్ అఫిడవిట్లోనే బయటపడ్డాయి. మరి దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.