త‌క్ష‌ణం.. 4 వేల పింఛ‌న్‌.. కాంగ్రెస్ హామీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సామాజిక పింఛ‌న్ పెంపుద‌ల ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా మారిపోయింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందే అధికార బీఆర్ ఎస్ పార్టీ దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. తాము అధికారంలో మ‌ళ్లీ వ‌స్తే.. పింఛ‌నును ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ.. ఐదేళ్లు పూర్త‌య్యేనాటికి రూ.5000 చేస్తామ‌ని బీఆర్ ఎస్ అధినేత ప్ర‌క‌టించారు. అయితే.. దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఆయ‌న అనుస‌రిస్తున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో దీని ప్ర‌చారాన్ని త‌గ్గించారు. అయినా.. సైలెంట్‌గా దీనిపై క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కూడా పింఛ‌న్ వ్య‌వ‌హారాన్ని తెర‌మీదికి తెచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు పూర్తి చేసిన ద‌రిమిలా.. తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పింఛ‌న్‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. “వారు(బీఆర్ ఎస్‌) మీకు ఏడాదికి ముష్టేస్తామంటున్నారు” అని తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ తాము.. అధికారంలోకి వ‌చ్చిన త‌క్ష‌ణం సామాజిక పించ‌న్‌ను రూ.4000 అమ‌లు చేసి తొలి మాసం నుంచే అందిస్తామ‌ని చెప్పారు. రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్ నిర్వ‌హించిన‌ ప్రజా విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, తాగుడులో తెలంగాణను నంబర్‌ వన్‌ చేశారని రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎందరికి ఇచ్చారని, కాంగ్రెస్‌ సునామీలో బీఆర్ ఎస్‌ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము తెలంగాణ స‌మాజం బాగు కోరుకుంటున్నామ‌ని.. వారు ఆస్తులు పెంచుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. పింఛ‌న్ పెంచే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని రేవంత్ చెప్పారు.