వైసీపీ వ్యూహానికి సుప్రీంకోర్టు బ్రేకేస్తుందా?

కొన్ని కొన్ని విష‌యాలు చిన్న‌వే అయినా.. నాగ‌రిక స‌మాజానికి సంబంధం లేద‌ని అనుకున్నా.. విష‌య ప్రాధాన్యాన్ని బ‌ట్టి వాటికి ప్రాధాన్యం వ‌చ్చేస్తుంది. ఆయా విష‌యాలు అత్యంత వేగంగా ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తాయి. చ‌ర్చ‌లుగా రూపాంత‌రం కూడా చెందుతా యి. దీనిపై ఏం జ‌రుగుతుందో? ఏం చేస్తారో? అనే ఉత్కంఠ కూడా తెర‌మీదికి వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఇలాంటి ఓ విష‌య‌మే ఏపీలో గుప్పు మంది!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ట్టుగా ఉన్న కీల‌క విష‌యం.. మాజీ ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ బాబు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం.. ఇది వైర‌ల్ కావ‌డంతో సంచ‌ల‌నం అయింది. వాస్త‌వానికి ఈ విష‌యంపై నిమ్మ‌గ‌డ్డ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం కూడా ఎవ‌రికీ తెలియ‌దు. అది కోర్టులో లిస్ట్ కావ‌డం.. విచార‌ణ‌కు అనుమ‌తి పొందడంతో దీనిపై చ‌ర్చ సాగుతోంది. ఏం జ‌రుగుతుంది? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారి.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉత్కంఠ‌ను కూడా రేపుతోంది.

విష‌యం ఏంటంటే..

మ‌రో ఐదు మాసాల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల విధుల‌కు త‌న స్వీయ నియ‌మిత వ‌లంటీర్ల‌ను వినియోగించుకునేందుకు రెడీ అయింది. వాస్త‌వానికి ఈ విధుల‌ను కొన్ని ద‌శాబ్దాలుగా ఉపాధ్యాయులే నిర్వ‌హిస్తున్నారు. అయితే..ఈ ద‌ఫా వైసీపీపై ఆగ్ర‌హంతో ఉన్న‌(జీతాలు స‌రిగా ఇవ్వ‌క‌పోవ‌డం.. ప‌నిభారం పెర‌గ‌డం, సీపీఎస్ ర‌ద్దు చేయ‌క‌పోవ‌డం వంటి ఇత‌ర‌త్రా కార‌ణాలు) ఉపాధ్యాయులు త‌మ పుట్టి ముంచుతార‌ని భావించిన వైసీపీ వారిని ఎన్నిక‌ల విధుల నుంచి దూరం చేస్తూ.. గ‌తంలోనే జీవో ఇచ్చింది.

ఈ క్ర‌మంలో ఇప్పుడు ఈ బాధ్య‌త‌ల‌ను వ‌లంటీర్ల‌కు అప్ప‌గించారు. వారు వార్డు వార్డు.. సందు సందు తిరుగుతూ.. ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎవ‌రి ఓట్లు ఎవ‌రికి ప‌డుతున్నాయి? ఎవ‌రు ఎవ‌రికి సానుభూతి ప‌రులు అనే కీల‌క విష‌యాల‌ను రాబ‌డుతున్నా రు. ఇది ఎన్నిక‌ల్లో ప్ర‌భావితం చూపే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నాయి. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం త‌న మానాన త‌ను ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ బాబు.. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పిటిష‌న్ రూపంలో కేసు వేశారు.

ఎన్నిక‌ల విధుల్లో వ‌లంటీర్ల జోక్యం వ‌ద్ద‌ని.. ఆ బాధ్య‌త‌ను టీచ‌ర్ల‌కే అప్ప‌గించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని.. ఆయ‌న పిటిష‌న్‌లో కోరారు. అంతేకాదు.. వ‌లంటీర్లంద‌రూ అధికార పార్టీవారేన‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త వివ‌రాలు, సున్నిత అంశాల‌ను కూడా వీరు సేక‌రిస్తున్నార‌ని పిటిష‌న్‌లో వివ‌రించారు. ఈ డేటాను కొన్ని ప్రైవేటు సంస్థ‌లు(వైసీపీ అనుకూల‌) ప్రొఫైల్ చేస్తున్నాయ‌ని కూడా నిమ్మ‌గ‌డ్డ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌డంతో విష‌యం వెలుగు చూసింది. దీనిపై సుప్రీం కోర్టు విచార‌ణ చేప‌ట్టి.. త‌గిన ఆదేశాలు ఇస్తే.. వైసీపీ వ్యూహానికి బ్రేకులు ప‌డ‌తాయ‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అంటున్నారు. ఇదే విష‌యం ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఎక్క‌డ‌విన్నా.. వ‌లంటీర్లు-టీచ‌ర్ల విష‌యంపైనే ఎక్కువ‌గా చ‌ర్చించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.