ఎంఎల్సీలపై కేసీయార్ మండిపోతున్నారా ?

కొందరు ఎంఎల్సీలపై కేసీయార్ మండిపోతున్నారట. కారణం ఏమిటంటే పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్ధుల విజయానికి వీళ్ళు ఏమాత్రం సహకరించటంలేదట. సహకరించకపోగా వ్యతిరేకంగా పనిచేస్తు ఓటమికి కారణమవుతున్నారనే సమాచారం కేసీయార్ కు అందిందని పార్టీవర్గాల సమాచారం. విషయం ఏమిటంటే ఎంఎల్సీలుగా ఉంటూనే ఎంఎల్ఏ టికెట్ల కోసం కొందరు బాగా ప్రయత్నించారు. అయితే ఎంఎల్సీలుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎంఎల్ఏ టికెట్లు ఎందుకని కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో కొందరు ఎంఎల్సీలకు మండిందట.

అందుకనే తమను కాదని టికెట్లు తెచ్చుకున్న అభ్యర్దులపై తమ కసినంతా తీర్చుకుంటున్నారని పార్టీలోనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునే ఉద్దేశ్యంతోనే దాదాపు రెండున్నర నెలల ముందే కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించారు. ఎంతముందుగా అభ్యర్ధులను ప్రకటించినా ఆశించినా స్ధాయిలో కొందరు ఎంఎల్సీలు, సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతల నుండి సహకారం లభించటంలేదనే ఫీడ్ బ్యాక్ కేసీయార్ కు అందిందట.

అందుకనే కొందరు ఎంఎల్సీలను కేసీయార్ పిలిపించుకుని గట్టిగా క్లాసులు కూడా పీకినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయినా వారిలో ఆశించిన మార్పురాలేదని తాజాగా కొందరు అభ్యర్ధులు కూడా ఫిర్యాదులు చేస్తున్నారట. తమ మద్దతుదారులకు, కులసంఘాల నేతల్లో తమకు బాగా సన్నిహితులైన వాళ్ళతో భేటీ అయిన కొందరు ఎంఎల్సీలు అభ్యర్ధులకు వ్యతిరేకంగా పనిచేయమని నోటిమాటగా చెబుతున్నారట. ఈ విషయం బయటకు పొక్కగానే అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తాండూరులో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అభ్యర్ధి పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపుకు ఏమాత్రం సహకరించటంలేదట. కొడంగల్ లో పోటీచేస్తున్న తన సోదరుడి గెలుపుకోసమే పనిచేస్తున్నారట.

తాండూరులో పట్నంకు మంచిపట్టుంది. రోహిత్ ను గెలిపిస్తారని అనుకుంటే చివరకు పట్నం పట్టించుకోవటంలేదని సమాచారం. భూపాలపల్లిలో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ స్పీకర్ మధుసూధనాచారి కూడా అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును పట్టించుకోవటంలేదట. గండ్ర గెలుపుకన్నా ఓటమికే ఎక్కువ పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వనందుకు ఎంఎల్సీ కోటిరెడ్డి అభ్యర్ధి నోముల భగత్ కు సహకరించటంలేదని ఆరోపణలున్నాయి. ఎంఎల్సీ యాక్టివిటీస్ పై కేసీయార్ ప్రత్యేకంగా రిపోర్టులు తెప్పించుకుంటున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.