కేసీయార్ లెక్క తప్పుతోందా ?

రాబోయే ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్ విషయంలో కేసీఆర్ లెక్క తప్పుతోందా ? క్షేత్ర స్ధాయిలో జరగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే బీఆర్ఎస్ కే లాభమని కేసీయార్ తో పాటు అధికారపార్టీ నేతలంతా అంచనా వేశారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది. దాంతో ముందు టీడీపీ తరువాత వైఎస్సార్టీపీ పోటీ నుండి విరమించుకున్నాయి. టేజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను కూడా కలుపుకున్నారు. ఇక్కడే కేసీయార్ లెక్కతప్పుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మూడోసారి గెలిచి కేసీయార్ కు హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఇవ్వకూడదనే ఆలోచనను కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా అమలు చేస్తున్నారు. ఒకవైపు కేసీయార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. మరోవైపు బీజేపీ పూర్తిగా డీలాపడిపోయింది. దాంతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అనే ప్రచారం పెరిగిపోతోంది. ముఖ్యంగా జనాల్లో కాంగ్రెస్ బలం బాగా పుంజుకుంటోందనే మౌత్ టాక్ విపరీతంగా పెరిగిపోతోంది.

రాష్ట్రంలోని కమ్మ సామాజికవర్గం ఓట్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇది బీఆర్ఎస్ పైన మానసికంగా దెబ్బకొట్టే అంశమనే చెప్పాలి. ఈ అంశం ఎంతవరకు నిజమనే విషయం తేలేది డిసెంబర్ 3వ తేదీ ఫలితాల్లో మాత్రమే. అయినా కమ్మ సామాజికవర్గమంతా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వబోతున్నట్లు ప్రచారమైతే పెరిగిపోతోంది. టీడీపీ పోటీనుండి తప్పుకోవటంతో ఈ విషయం నిజమే అనే సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లయ్యింది.

రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోవటంతో కాంగ్రెస్ డీలా పడిపోయింది. మూడో ఎన్నికలో కూడా ఓడిపోతే జనాలు పార్టీని మరచిపోవటం ఖాయం. బీఆర్ఎస్ మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయి వాళ్ళంతట వాళ్ళుగా జనాలు కాంగ్రెస్ కు ఓట్లేసే పరిస్ధితి వస్తే మాత్రమే అధికారంలోకి వస్తుంది. అయితే అంతవరకు వెయిట్ చేయకూడదన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ సీనియర్లంతా దాదాపు ఏకతాటిపైకి వచ్చి ప్రచారం చేస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం కూడా తెలంగాణాలో ఊపు పెరిగిపోవటానికి కారణమైంది. మొత్తానికి గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే హ్యాట్రిక్ పై కేసీయార్ లెక్క తప్పుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.