ఇప్పుడు మద్దతు.. ఎన్నికల తర్వాత విలీనం..

కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడం తప్ప షర్మిలకు మరో మార్గం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇందుకోసం చాలా రోజులుగా షర్మిల చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించలేదు. కానీ తెలంగాణ ఎన్నికల తర్వాత మాత్రం షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల.. కాంగ్రెస్ మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా 2021లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని షర్మిల ముందుకు సాగారు. నిరుద్యోగ సమస్యను భుజాలకెత్తుకున్నారు. పాదయాత్ర చేశారు. ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. కానీ ఏదీ కలిసి రాలేదు. ప్రజల్లో ఆదరణ దక్కలేదు. పార్టీలోని కీలక నాయకులు కూడా బయటకు వెళ్లిపోయారు. దీంతో ఏమీ తోచని పరిస్థితుల్లో కాంగ్రెస్ లో తన పార్టీ విలీనానికి షర్మిల సిద్ధమయ్యారు. ఇందుకోసం బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో రాయబారం కూడా నడిపారు.

కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం కోసం ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ అధిష్ఠానంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ సానుకూల నిర్ణయం రాలేదు. ఈ సారి ఎన్నికల్లో పాలేరు టికెట్ ను డిమాండ్ చేసిన షర్మిల.. మరికొన్ని టికెట్లను తమకు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరారు. కానీ షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమైతే తెలంగాణలో పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని ఇక్కడి నాయకులు వ్యతిరేకించారు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె కావడంతో షర్మిల రాకను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వద్దన్నారు.

దీంతో అధిష్ఠానం ఆలోచనలో పడింది. పొత్తు విషయం చెప్పాలని షర్మిల డెడ్ లైన్ పెట్టినా కాంగ్రెస్ నుంచి స్పందన రాలేదు. దీంతో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు. టికెట్ల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు. కానీ పోటీ చేస్తే ఎలాంటి లాభం ఉండకపోగా.. మరింత నష్టం జరిగే ప్రమాదముందని భావించిన షర్మిల చివరకు పోటీ నుంచి తప్పుకున్నారనే చెప్పాలి. కాంగ్రెస్ కు మద్దతునిస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం ఖాయమనే చెప్పాలి.