వివేక్ చేరికతో వెయ్యేనుగుల బలం: రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టేందుకు ముమ్మరంగా ప్రచారం మొదలుబెట్టింది. ఇక, బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు చేరుతున్నారు. ఈ క్రమంలోనే వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వివేక్ తో పాటు ఆయన తనయుడు వంశీ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరానని వివేక్ అన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతోనే బిజెపిని వీడానని వివేక్ చెప్పారు. వివేక్ చేరికతో పార్టీకి వెయ్యేనుగు బలం వచ్చిందని, గాంధీ కుటుంబంతో వివేక్ కుటుంబానికి తరతరాలుగా అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

బీఆర్ఎస్ ను గద్దె దించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, ఇటువంటి సమయంలో వివేక్ వంటి నేతలు కాంగ్రెస్ లో చేరడం ఎంతో అవసరమని అన్నారు. అంతకుముందు, వివేక్ తో దాదాపు గంటన్నర పాటు రేవంత్ రెడ్డి ఏకాంతంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు వివేక్ ను కోరారు. ఈ నేపథ్యంలోనే వివేక్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పెద్దపల్లి లోక్ సభ టికెట్ వివేక్ కు ఖాయమైందని, వివేక్ తనయుడు వంశీకి చెన్నూరు శాసనసభ టికెట్ పక్కా అని తెలుస్తోంది. ఆల్రెడీ వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ కు కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. త్వరలో వెలువడనున్న మూడో జాబితాలో వివేక్, వంశీల పేర్లు ఉంటాయని తెలుస్తోంది.