కొత్తగా హ్యాకింగ్ రగడ మొదలైందా ?

జాతీయస్ధాయిలో కేంద్రప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య ప్రతిరోజు ఏదో ఒక వివాదం రేగుతునే ఉండాలి. ఇందుకు అవసరమైన జాగ్రత్తలను నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్నట్లుంది. తాజాగా ప్రతిపక్షాల మొబైల్ ఫోన్ల హ్యాకింగ్ వివాదం రాజుకుంది. ప్రభుత్వం తరపున పనిచేస్తున్న కొందరు హ్యాకర్లు మీ మొబైల్ ఫోన్లను టార్గెట్ గా చేసుకున్నట్లు ఐఫోన్ కంపెనీ యాపిల్ యాజమాన్యం నుండి కొందరు ప్రతిపక్ష నేతలకు హెచ్చరికలు అందాయి. తమ కంపెనీ ఫోన్లను వాడుతున్న ప్రముఖ రాజకీయ నేతలకు కంపెనీ మెసేజ్ రూపంలో అలర్ట్ పంపింది.

ఇపుడీ అలర్టే తాజా వివాదానికి కారణమైంది. మెసేజిలు అందుకున్న ప్రతిపక్ష నేతల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్డున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధితో పాటు కొందరు అగ్రనేతలున్నారు. వీళ్ళు కాకుండా సీపీఎం కార్యదర్శి సీతారామ్ ఏచూరి, అఖిలేష్ యాదవ్, ప్రియాంక చతుర్వేది, మహువా మొయిత్రా, రాఘవ్ చద్దా లాంటి ప్రముఖులున్నారు. ఒకేసారి యాపిల్ కంపెనీ నుండి అలర్ట్ మెసేజిలు, మెయిళ్ళు రావటంతో దేశంలో కలకలం మొదలైంది. ఆమధ్య ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ సాఫ్ట్ వేర్ కంపెనీ యాప్ ద్వారా ప్రతిపక్షాల్లోని ప్రముఖులే కాకుండా వివిధ రంగాల్లోని ప్రముఖుల ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసిందనే దుమారం తెలిసిందే.

పెగాసస్ సాఫ్ట్ వేర్ వాడకంపై స్వయంగా సుప్రింకోర్టే సూమోటాగా కేసు టేకప్ చేసింది. విచారణకు రమ్మని కేంద్రానికి నోటీసులిచ్చినా కేంద్రం స్పందించలేదు. చివరకు విచారణకు హాజరైనా స్పైవేర్ సాఫ్ట్ వేర్ వాడారా లేదా అన్న క్లారిటి ఇవ్వమంటే ఏ విషయం చెప్పటానికి కేంద్రం మొండికేసిన విషయం తెలిసిందే.

కేంద్రం వైఖరితోనే పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించిందనే విషయం అందరికీ అర్ధమైపోయింది. అప్పట్లో దేశవ్యాప్తంగా చాలా గొడవలే అయ్యాయి. ఆ విషయం కోర్టు విచారణలో ఉండటంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. ఇంతలో తాజాగా మొబైల్ ఫోన్ల హ్యాకింగ్ వివాదం మొదలైంది. అయితే ప్రతిపక్షాలు ఎంత గొడవలు చేసినా మోడీ ప్రభుత్వం లెక్కచేయటంలేదు. ప్రతిపక్షాలు ఏమన్నా చెప్పదలచుకుంటే కోర్టులో కేసులు వేసుకోవచ్చని మాజీ కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ చాలెంజ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.