45 ఏళ్ల రాజకీయ జీవితంలో తప్పు చేయలేదు, చేయను: చంద్రబాబు

52 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సాయంత్రం 4.30 గంటల సమయంలో చంద్రబాబు విడుదలై బయటకు వచ్చారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని..ఇకపై కూడా ఏ తప్పు చేయబోనని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.

గత 52 రోజులుగా తాను కష్ట కాలంలో ఉన్నానని, ఆ సమయంలో తనకు పలు రాజకీయ పార్టీలు, పలువురు రాజకీయ నేతలు, ఐటీ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయని, వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రత్యేకించి జనసేన పార్టీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఐటీ ఉద్యోగులు తనకు సంఘీభావంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు.

తనతో పాటు తన కుటుంబం కష్ట సమయంలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా తనపై చూపించిన అభిమానం, తెలిపిన సంఘీభావం జీవితాంతం మరచిపోలేనని చంద్రబాబు అన్నారు. వారితోపాటు తనకు సంఘీభావం ప్రకటించిన రాజకీయ నాయకులు, రాజకీయేతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు కూడా తనకు సంఘీభావంగా కార్యక్రమం చేపట్టారని గ్రాటిట్యూడ్ సీబీఎన్ కాన్సర్ట్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తనకు సంఘీభావంగా ఎక్కడికక్కడ రాష్ట్రంలో టిడిపి కార్యకర్తలు, టిడిపి నేతలు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని, వారందరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు తనకు సంఘీభావం తెలుపుతూ కొందరు సైకిల్ యాత్ర చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత 52 రోజులుగా తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన మంచి పనులను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మీడియా మిత్రులు, పలువురు నాయకులు, ఉద్యోగులు ప్రస్తావించారని, వారందరికీ కృతజ్ఞతలు అని చంద్రబాబు అన్నారు.

ఇక, చంద్రబాబు విడుదల సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. జైలు వద్దకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్ట్ వరకు భారీ ర్యాలీ చేపట్టేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు భారీగా చేశాయి.