చంద్రబాబుపై మరో కేసు నమోదు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ నేడు ముగిసింది. అయితే, ఈ పిటిషన్ పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. రేపు తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు.

దాంతోపాటు, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనల తేదీలను కూడా రేపు నిర్ణయిస్తామన్నారు. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును కోరడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి.

మరోవైపు, చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై సీఐడీ తాజాగా ఇంకో కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.

ఈ క్రమంలోనే చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.