తెలంగాణ ఎల‌క్ష‌న్స్‌: ఓటు బ్యాంకు చీల‌డం క‌ష్ట‌మే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క పార్టీల మ‌ధ్య హోరా హోరీ పోరు సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, సాధార‌ణంగా ఏ ఎన్నిక‌లో అయినా.. అధికార పార్టీని దెబ్బకొట్టేందుకు ఓటు బ్యాంకును చీల్చే రాజ‌కీయాలు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే చిన్న చిత‌కా పార్టీలు అరంగేట్రం చేయ‌డం.. వీటి వెనుక పెద్ద‌పార్టీల ద‌న్ను ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ, తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఈ ఛాన్స్ లేద‌ని అంటున్నారు మేధావులు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డా చిన్నాచిత‌కా పార్టీల హ‌వా క‌నిపించ‌డం లేదు. కేవ‌లం ప్ర‌ధాన పార్టీల మ‌ధ్యే యుద్ధం జ‌రుగుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు కీల‌క‌మైన తెలుగు దేశం పార్టీ నుంచి ఆప్ , లోక్‌స‌త్తా వంటి పార్టీలు కూడా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నాయి. మ‌రోవైపు బీఎస్పీ ఉన్న‌ప్ప‌టికీ.. మేనిఫెస్టో అంటూ.. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హ‌డావుడి చేసిన‌ప్ప‌టికీ.. ఈ ప్ర‌భావం పెద్ద‌గా ఉండే అవ‌కాశం లేద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

మ‌రోవైపు.. క‌మ్యూనిస్టులు కూడా కొన్ని ప్రాంతాల‌కే.. కొన్ని స్వ‌ల్ప నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అవుతున్నా రు. ఇక‌, మ‌రో ప్ర‌భావిత పార్టీ అని పేరున్న జ‌న‌సేన ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. అస‌లు పోటీలో ఉంటుందా? ఉండ‌దా ? అనేది తెలియ‌దు. ఉన్నా.. బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం మెండుగా ఉంది. దీంతో ఆ పార్టీ కూడాఓటు బ్యాంకును చీల్చే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు ఎవ‌రికి ద‌క్కుతుంది? కేసీఆర్‌పై క‌సితో ఉన్న ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు, నిరుద్యోగులు ఎటు వైపు మొగ్గు చూపుతారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికిప్పుడు అయితే.. ఈ త‌ట‌స్థ ఓటు బ్యాంకు ఎవ‌రికీ అనుకూలంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఉన్న పార్టీల్లో ఏది మెరుగైన పార్టీ అనే త‌ర్జ‌న భ‌ర్జ‌న ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగానే ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.