వివేక్ ను రేవంత్ ఒప్పిస్తున్నారా?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో విజయం కోసం కసరత్తులు చేస్తున్న పార్టీలు.. నాయకుల విషయంలోనూ దుకుడు కొనసాగిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలోని కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకుని లాభం పొందడంతో పాటు ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో సాగుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలోని కీలక నాయకులను కాంగ్రెస్ తిప్పుకుంది. ఇప్పుడు బీజేపీని గట్టి దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఆ పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వివేక్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివేక్ ను కలిసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. దీనిపై వివేక్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిన వివేక్ తిరిగి హస్తం గూటికి చేరడం ఖాయమైందనే చెప్పాలి. దివంగత నాయకుడు వెంకటస్వామి వారసత్వంతో వివేక్ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లోకి వెళ్లారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ లో చేరారు. 2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి వెళ్లిపోయారు.

బీజేపీలోకి చేరినప్పటికీ మొదటి నుంచి తగిన ప్రాధాన్యత దక్కడం లేదని వివేక్ అసంత్రుప్తితోనే ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీకి తెలంగాణలో గ్రాఫ్ పడిపోవడంతో ఇక లాభం లేదనుకుని కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లేందుకు వివేక్ సిద్ధమైనట్లు టాక్. ఇప్పటికే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వివేక్ కూడా అదే బాటలో సాగుతున్నారనే చెప్పాలి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, విజయ శాంతి తదితర నేతలతో కలిసి వివేక్ రహస్య సమాచారం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలం నుంచే బీజేపీకి ఈ నాయకులు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ పార్టీ మారడం ఖాయమనిపిస్తోందనే చెప్పాలి.