లక్కంటే వీళ్ళదేనా ?

కాంగ్రెస్ పార్టీలో సంవత్సరాలతరబడి కష్టపడుతున్న వాళ్ళకి టికెట్లు దక్కటంలేదు. పార్టీలో సిన్సియర్ గా, అధిష్టానానికి లాయల్ గా ఉన్న వాళ్ళలో చాలామందికి టికెట్లు రావటంలేదు. అలాంటిది రెండో జాబితాల్లో టికెట్లు సాధించిన వాళ్ళలో కొందరిని చూస్తే లక్కంటే వీళ్ళదేనా అనే చర్చ పెరిగిపోతోంది. కాంగ్రెస్ లోనే చాలాకాలం ఉండి పార్టీ నాయకత్వంతో విభేదించి పార్టీకి రాజీనామాలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీల్లో చేరి కొంత కాలం ఉన్న తర్వాత మళ్ళీ ఆ పార్టీలకు రాజీనామాలు చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు.

ఢిల్లీలోని అధిష్టానం పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో కొందరికి టికెట్లు ఇలా వచ్చి జేబులో పడ్డాయి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డినే తీసుకుందాం. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పడక రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేయటంతో ఉపఎన్నికలొచ్చాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన దగ్గర నుండి అక్కడ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. చివరకు తన సోదరుడు, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చొరవతో బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిపోయారు. వెంటనే మునుగోడు టికెట్ వచ్చి జేబులో పడింది.

టీడీపీలో సంవత్సరాలు పనిచేసి పార్టీకి బతుకులేదని చెప్పి బీజేపీలో చేరారు రేవూరి ప్రకాష్ రెడ్డి. అయితే బీజేపీకి తెలంగాణా భవిష్యత్తులేదని అనిపించి ఈమధ్యనే కాంగ్రెస్ లో చేరారు. అలాంటిది వెంటనే పరకాల అసెంబ్లీ టికెట్ వచ్చేసింది. ఇదే పద్దతిలో యెన్నం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ కేటాయించింది అధిష్టానం.

కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అయితే అక్కడ కేసీయార్ పట్టించుకోకపోవటంతో రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరగానే భువనగిరికి టికెట్ దక్కించుకున్నారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ హోదాలో రేఖానాయక్ కాంగ్రెస్ లో చేరారు. అయితే అంతకుముందే పార్టీలో చేరిన ఆమె భర్త శ్యామ్ నాయక్ కు ఖానాపూర్ అభ్యర్ధిగా అధిష్టానం టికెట్ ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి టికెట్ వచ్చేసింది. మొత్తానికి వీళ్ళందరినీ లక్కీ అభ్యర్ధులనే అంటున్నారు పార్టీలో.