చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయా ?

స్కిల్ స్కామ్ లో అరెస్టయి 48 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండులో  ఉన్న చంద్రబాబునాయుడుకు అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయా ? టీడీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. మొన్నటి జూన్లోనే చంద్రబాబు ఎడమ కంటికి శుక్లాల ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన మూడు నెలల్లోగా కుడికంటికి కూడా ఆపరేషన్ జరగాలని హైదరాబాద్ లోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి ఒక బులెటిన్ జారీచేసింది. దీనికి అదనంగా ప్రభుత్వ వైద్యులు కూడా చంద్రబాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు రిపోర్టిచ్చారని తమ్ముళ్ళు చెబుతున్నారు.

అందుబాటులోని సమాచారం ప్రకారం వెన్నుకింద భాగంలో నొప్పి, మల ద్వారం దగ్గర నొప్పి, అసౌకర్యంతో బాధపడుతున్నారట. అలాగే నడుము కింద నుండి దద్దుర్లు పెరిగిపోవటంతో దురదలు పెరిగిపోతున్నాయట. వెంటనే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్టు, లివర్ ఫంక్షన్ టెస్టు, సీరం ఎలక్ట్రోలైట్స్, కోగ్యులేషన్ ప్రొఫైల్, హెచ్ బీఏ1సీ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఈసీజీ, చెస్ట్ ఎక్సరే, 2 డీ ఎకో లాంటి పరీక్షలు చేయాల్సిన అవసరముందని రిపోర్టులో ఉందని సమాచారం.

చంద్రబాబు ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వమే అన్నీజాగ్రత్తలు తీసుకోవాలని తమ్ముళ్ళు కోరుతున్నారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల నివేదిక ప్రకారం కంటి ఆపరేషన్ చేయాలి కాబట్టి వెంటనే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని లాయర్లు ఏసీబీ  కోర్టుతో పాటు హైకోర్టులో కూడా పిటీషన్లు వేశారు. దీనిపై ఇప్పటికే ఒక రోజంతా విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం కూడా విచారణ చేయబోతోంది.

ఇపుడు సమస్య ఏమైందంటే హైకోర్టుకు దసరా పండుగ సెలవులు కావటంతో వెకేషన్  బెంచ్ అత్యవసరమైన కేసులను మాత్రమే విచారిస్తోంది. దీనివల్ల విచారణలో ఆలస్యం జరుగుతోంది. డాక్టర్లు ఇచ్చారని చెబుతున్న రిపోర్టు ప్రకారం జైలులోనే ఉంచి వైద్యం చేయగలిగినవి ఏవి, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఎంత అన్నది  కోర్టు నిర్ణయిస్తుంది. చంద్రబాబు అనారోగ్యం పెరగకుండా జైలులో కూడా చల్లటి వాతావరణాన్నికంటిన్యు చేయాలని, బాగా గాలి తగిలే దుస్తులనే వేసుకోవాలని, ఎక్కవ సమయం ఒకే భంగిమలో కూర్చోవద్దని డాక్టర్లు ఇప్పటికే సలహా ఇచ్చారట.  మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.