రెండు పార్టీల మధ్య పంచాయితి

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తు దాదాపు ఖాయమైపోయింది. కాకపోతే ఒకే ఒక్క నియోజకవర్గంపైన రెండుపార్టీల మధ్య పంచాయితి నడుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎంకు పొత్తులు దాదాపు కుదిరినట్లే అనుకోవాలి. చెన్నూరు, కొత్తగూడెం సీట్లను సీపీఐకి కేటాయించటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించింది. కాబట్టి సీపీఐతో పంచాయితి లేదు. సమస్యల్లా సీపీఎంతోనే వస్తోంది. సీపీఎంకు కూడా రెండు నియోజకవర్గాలను కేటాయించటానికి కాంగ్రెస్ అంగీకరించింది.

అయితే సమస్యంతా ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంపైనే వస్తోంది. పాలేరులో పోటీచేయటానికి సీపీఎం సెక్రటరీ తమ్మినేని వీరభద్రం గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. ఎంతస్ధాయిలో ప్లాన్ చేసుకున్నారంటే చాలాకాలంగా పాలేరులో తమ్మినేని ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. ఇదే సమయంలో పాలేరులో పోటీచేసే విషయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనవాసరెడ్డికి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పొంగులేటి చాలా బిగ్ షాటన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు పొంగులేటి పాలేరులో ప్రచారం చేసుకుంటున్నారు.

అసలు ఇక్కడ పోటీచేయాల్సింది తుమ్మల నాగేశ్వరరావా లేకపోతే పొంగులేటా అన్న ప్రశ్న వచ్చింది. అయితే వీళ్ళిద్దరే పంచాయితీని సర్దుబాటు చేసుకుని ఖమ్మంలో తుమ్మల పోటీచేసేట్లు, పాలేరులో పొంగులేటి పోటీ చేసేట్లుగా నిర్ణయానికి వచ్చారు. దీంతో అందరు హ్యాపీస్ అనే అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో ఇదే పాలేరుపై సీపీఎం సెక్రటరీ తమ్మినేని పట్టుబట్టారు. ఇపుడు సమస్య ఏమైందంటే విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది.

పాలేరును తమ్మినేనికి వదలకపోతే సీపీఎం దూరంగా ఉండే అవకాశముంది. పొత్తులో తనకు నియోజకవర్గాన్ని వదలకపోతే తాను సీపీఎం తరపున కచ్చితంగా పోటీచేస్తానని ఇప్పటికే తమ్మినేని ప్రకటించేశారు. ఇదే విధమైన ప్రకటన పొంగులేటి కూడా చేయటంతో సమస్య మరింతగా బిగుసుకుపోయింది. దాంతో పాలేరు మీద రెండుపార్టీల మధ్య మొదలైన పంచాయితి ఎన్నిరోజులైనా తెగటంలేదు. ఎన్ని సార్లు సిట్టింగులు వేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో ఏమిచేయాలో రెండుపార్టీల్లోను దిక్కుతోచటంలేదు. ఒకవైపు ఎన్నికలు తరుముకొచ్చేస్తోంది, ఇంకోవైపు పంచాయితి తెగటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.