కేసీఆర్ పై పోటీ.. ఈటలకు బీఆర్ఎస్ నాయకుల సపోర్ట్!

తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ కు పార్టీలోని అసంత్రుప్త నాయకుల నుంచి తలనొప్పి తప్పడం లేదనే చెప్పాలి. ఈ అసంత్రుప్త నాయకులను బుజ్జగించేందుకు కేటీఆర్, హరీష్ రావు.. ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగినా కొంతమంది నేతలు మాత్రం వినడం లేదని తెలిసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ రెబల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కోసం పని చేసేందుకూ వెనుకాడడం లేదనే టాక్ వినిపిస్తోంది. తాజాగా గజ్వేల్ లో బీఆర్ఎస్ అసంత్రుప్త నేతల వైఖరే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి కోసం పని చేస్తామని ఈ నాయకులు చెప్పడం గమనార్హం.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అయితే సొంతగడ్డ అయిన గజ్వేల్ లో కేసీఆర్ కు అసంత్రుప్త సెగ తగులుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కేసీఆర్ పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఆయనకు మద్దతుగా నిలుస్తామని అసంత్రుప్త నేతలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్- ప్రజ్ణాపూర్ బల్దియా మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ఏఎంసీ మాజీ ఛైర్మన్ టేకులపల్లి రాంరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సింగం సత్తయ్య, మాజీ ఎంపీపీ రాజు, పలువురు సర్పంచులు తదితర నాయకులు కలిసి సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ బీఆర్ఎస్ రెబల్ నాయకులంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు.

గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే మేలు జరుగుతుందని అనుకున్నామని, కానీ ఇక్కడి నాయకులను తొక్కేశారని అసంత్రుప్త నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా కేసీఆర్ పై పోటీ చేస్తే ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలుస్తామని కూడా చెప్పారు. మరోవైపు అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అసంత్రుప్త నేతల మద్దతు కూడా ఈటలకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈటల గజ్వేల్ బరిలో దిగుతారా? అన్నది వేచి చూడాలి.