బరాబర్ అంటా..కవితకు అర్వింద్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వాగ్వాదం నడుస్తోంది. బతుకమ్మ పండుగ చేసుకునేందుకు వచ్చిన తన గురించి అర్వింద్ అసభ్యకరంగా, అభ్యంతరకంగా మాట్లాడారని కవిత మండిపడ్డారు. కేసీఆర్ బిడ్డను కాబట్టి, ఏది పడితే అది మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

ఆ మాటలే వారి ఇంట్లో ఆడవారిపై మాట్లాడితే భరించగలరా? అని అర్వింద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పాలకులు కూడా ఇంత దారుణంగా మాట్లాడలేదని అన్నారు. అర్వింద్ వంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన సమయం వచ్చిందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కవిత కామెంట్లకు అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. అయ్యొపాపం కవితకు బాగలేనట్టున్నది. కేసీఆర్ గారి కూతురు. ఎన్నడు ఏపాపం చేయలే.. రూపాయి తినలేదు అంటూ చురకలంటించారు.

కవిత ఏనాడూ తెలంగాణ ప్రజలను ముంచలేదు, వంద రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీ తెచ్చింది, పసుపు బోర్డు తెచ్చింది అంటూ ఎద్దేవా చేశారు. ‘‘నీ జీవితానికి నీవుండే స్థాయికి నీవు అర్హురాలివి కాదు, మీ నాన్న కేసీఆర్‌ చేసిన పాపాలు మీ వల్లనే చేసిండు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తారా? కోవిడ్‌ సమయంలో ప్రజలు లక్షల డబ్బులు కడుతున్నా ఒక్కరికైనా ఆరోగ్య శ్రీ ఇచ్చినావా కేసీఆర్‌? అని ప్రశ్నించారు. చచ్చిపోతే ఇస్తా అనుడు మీ దొరబుద్దులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే మీరు చస్తే బిల్‌కుల్‌ డబ్బులు ఇస్తా అన్నా అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నువ్వు తెలంగాణ ఆడ బిడ్డవా? ఇట్లనే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు? అని కవితను ప్రశ్నించారు. నేను ఇంట్లో లేనప్పుడు మా అమ్మ ఇక్కటే ఉన్నప్పుడు కొందరిని ఇంటికి పంపి కుర్చీలు పగలగొట్టినప్పుడు ఏమైంది నీ ఆడపడచుదనం అని మండిపడ్డారు. నువ్వేమో ఆడపడుచువి.. మా అమ్మ ఆడపడుచుకాదా? అని ప్రశ్నించారు. నన్ను చెప్పుతో కొడతా అంటావు.. నీకు అంత సీన్‌ ఉందా? అని ఫైర్ అయ్యారు. ఆంధ్రోళ్లను కుక్కలు అన్న మాటలు మరిచిపోయారా? అని ప్రశ్నించారు.