తుమ్మలకు ఖమ్మం… పొంగులేటికి పాలేరు

పాలేరు టికెట్ కోసం పట్టుబట్టిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మధ్య సమోధ్య కుదిరిందా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. దీంతో పాలేరును వదిలేసుకున్న తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. మరోవైపు పాలేరులో విజయ దుందుభి మోగించేందుకు పొంగులేటి కసరత్తుల్లో మునిగిపోయారని సమాచారం.

బీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కడం లేదని బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మాజీ ఎంపీకి పాలేరుపైనా కన్ను ఉంది. మొదటి నుంచి కూడా పాలేరు నుంచి పోటీ చేస్తానని చెబుతూ వచ్చారు. కానీ బీఆర్ఎస్లో పాలేరు టికెట్ తనకు కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో తుమ్మల పార్టీని వీడారు. పాలేరు టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ లో చేరారు. తుమ్మల, పొంగులేటి ఇద్దరు పాలేరు కోసం పట్టుబట్టడంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. తుమ్మలకు సర్దిచెప్పి ఖమ్మం నుంచి పోటీ చేయించేలా ఒప్పించిందని తెలిసింది.

2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున తుమ్మల విజయం సాధించారు. కానీ 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ తరపున మళ్లీ ఖమ్మం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు తుమ్మల, పొంగులేటి టికెట్ల విషయంపై స్పష్టత వచ్చిందనే చెప్పాలి. దీంతో రెండో జాబితాలో వీళ్ల పేర్లు ఉండటం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మొదటి జాబితాలో వీళ్ల పేర్లు ఉండాల్సింది కానీ పాలేరు టికెట్ కోసం పట్టుబట్టడంతో పెండింగ్లో పెట్టారని పేర్కొన్నాయి.