అటు కాంగ్రెస్.. ఇటు కేసీఆర్.. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది?

తెలంగాణ ఎన్నికల రేసులో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ముందంజలో ఉండగా.. ఇప్పుడు విడతల వారీగా కాంగ్రెస్ జాబితాలు వెల్లడిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మేనిఫెస్టో ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్యే ఢీ అంటే ఢీ అన్నట్లు పరిస్థితి మారింది. మరి బీజేపీ ఏం చేస్తోందనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఎన్నికల రేసులో బీజేపీ వెనుకాలే ఉంది.

బీజేపీ ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తోంది. త్వరలోనే తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక మేనిఫెస్టోపై ఆ పార్టీ కసరత్తు చేయాల్సి ఉంది. ఇక్కడే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమం కోసం హామీలు ప్రకటించాయి. ఫించన్లు, రైతు బంధు, గ్యాస్ సిలిండర్ రేట్.. ఇలా రెండు పార్టీలు వరాల జల్లు కురిపించాయి. మరి ఇప్పుడు ఈ రెండు పార్టీలను తలదన్నేలా బీజేపీ మేనిఫెస్టో రూపొందించాల్సి ఉంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపొందించేందుకు బీజేపీకి సవాళ్లు తప్పడం లేదు. ఎందుకంటే ఉచిత పథకాలకు తాము వ్యతిరేకమని ఆ పార్టీ చెబుతూ వస్తోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు ప్రకటించినట్లుగా ఫించన్లు పెంపు విషయంలో బీజేపీ కూడా ఫోకస్ పెడుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఫించన్లు ఇంత పెంచుతాం.. అంత ఇస్తాం.. అని చెబితే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చి ఇక్కడ మాట్లాడాలని ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వచ్చే ఆస్కారముంది. ఇక గ్యాస్ సిలిండర్ విషయంలోనూ బీజేపీది మింగలేని కక్కలేని పరిస్థితే. కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్యాస్ సిలిండర్లపై ప్రజలకు మేలు చేస్తామని సంచలన ప్రకటనలు చేశాయి. కానీ 1100 దాటిపోయిన గ్యాస్ బండపై ఇటీవల కేంద్రం 300 వరకు తగ్గించింది. అది కూడా రాయితీ రూపంలో ఇస్తామంది. కానీ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గేంచే సాహసం బీజేపీ చేస్తుందా అంటే డౌటే. దీంతో బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంటుదన్న ఆసక్తి నెలకొంది.