అంచనాలు తప్పాయి.. కాంగ్రెస్ తొలిజాబితాలో సిత్రాలెన్నో!

అందరూ ఎంతో ఆశగా చూసిన తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా ఆదివారం ఉదయం వచ్చేసింది. గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ జాబితా పేరుతో నడుస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. తొలి జాబితాలో 78 పేర్లు ఉంటాయని ఒకరు.. కాదు యాభైకు పైనే పేర్లు ఉంటాయని ఇంకొకరు. ఇవన్ని తప్పు 40 లోపే మొదటి జాబితా ఉంటుందని మరికొందరు తమ వాదనలు వినిపించారు. ఇలా ఎవరి లెక్కలు వారు.. ఎవరి అంచనాలకు తగ్గట్లు వారు అంకెలు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే.. తన తొలి జాబితాను 55 మందితో విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. పార్టీ ప్రధాన కార్యదర్శి సంతకం.. ఆఫీస్ సీల్ తో రెండు పేజీలతో కూడిన జాబితాను విడుదల చేశారు.

ఈ జాబితాను చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపించాయి. అదే సమయంలో సిత్రాలకు కొదవ లేదు. తాజాగా విడుదల చేసిన మొదటి జాబితాలో మొదటి పేరు ఎస్సీ అభ్యర్థితో ప్రారంభించటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. జాబితాలోని మొత్తం 55 అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను కోట్ చేయటం ఒక ఎత్తు అయితే.. మొత్తం 55 పేర్లలో ఎవరికి లేని విధంగా మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు పేరు పక్కన మాత్రం ‘‘వెలమ’’ అంటూ ఆయన సామాజిక వర్గాన్ని పేర్కొనటం గమనార్హం.

అదే సమయంలో ఆయన కుమారుడు మైనంపల్లి రోమిత్ రావుకు మెదక్ సీటును కట్టబెట్టినట్లుగా పేర్కొన్నప్పటికీ.. ఆయన పేరు పక్కన మాత్రం వెలమ అని లేకపోవటం విశేషం. ఇలా తండ్రి.. కొడుకుల పేర్ల విషయంలో తేడా కనిపించింది. ఇక.. మొత్తం 55 మంది అభ్యర్థుల్లో 24 శాతం అభ్యర్థులు అంటే 13 మంది హైదరాబాద్ మహానగరానికి చెందిన అభ్యర్థులే. ఈ లెక్కలోకి హైదరాబాద్ మహానగర శివారుగా ఉండే చేవెళ్ల.. ఇబ్రహీంపట్నం లాంటివి తీసుకోలేదు.

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పేరులో జాబితాలో లేకపోవటం ఒక విశేషం. అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న భట్టి విక్రమార్క.. జాబితాలో చివరి నుంచి రెండో పేరుగా నిలిచింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అజారుద్దీన్ కు కేటాయించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. అదేమీ జాబితాలో లేకుండా పోయింది. అంతేకాదు.. ఎల్ బీ నగర్ సీటును ఆశిస్తున్న మధు యాష్కీ పేరు సైతం జాబితాలో లేదు.

హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ప్రకటించిన 13 మంది అభ్యర్థుల్లో పాతబస్తీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఆ 13 మంది ఎవరెవన్నది చూస్తే..

  1. మల్కాజిగిరి- మైనంపల్లి హన్మంతరావు
  2. కుత్భుల్లాపూర్ – కొలను హన్మంతరెడ్డి
  3. ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి
  4. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
  5. మలక్ పేట – షేక్ అక్బర్
  6. సనత్ నగర్ – డాక్టర్ కోట నీలిమ
  7. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
  8. కార్వాన్ – ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజారీ
  9. గోషామహల్ – మొగిలి సునీత
  10. చాంద్రాయణగుట్ -ట బోయ నరేశ్ (నగేశ్)
  11. యాకత్ పుర – రవి రాజు
  12. బహదూర్ పుర – రాజేశ్ కుమార్
  13. సికింద్రాబాద్ – ఆదం సంతోష్ కుమార్